రెడీ అవుతున్న స్మార్ట్ కార్డులు…
వరంగల్, ఫిబ్రవరి 26, (వాయిస్ టుడే )
Ready smart cards...
వాయిస్ టుడే
తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. అర్హత ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేసింది. వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందించనుంది. అయితే, ఈసారి రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్, యూనిక్ నెంబర్ తో అందుబాటులోకి తేనుంది.రాష్ట్రంలో 90లక్షలకు పైగా ఉన్న పాత లబ్ధిదారులతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్డుల తయారీకోసం షార్ట్ టెండర్ పిలిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కార్డు నమూనా అప్రూవల్ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు ఫైల్ ను పంపించారు. సీఎం నుంచి అనుమతి రాగానే కార్డుల ప్రింటింగ్ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ స్మార్ట్ కార్డులను ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది.మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ తరువాత కోడ్ తొలగిపోతుంది. దీంతో మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారులకు అందించే స్మార్ట్ రేషన్ కార్డుపై ఎవరి ఫొటో ఉండదు. కేవలం యూనిక్ నెంబర్ తోపాటు ఏటీఎం కార్డు తరహాలో కార్డుపై చిప్ తో ఉండేలా ఈ కార్డును తయారు చేస్తున్నారు. ఏటీఎం కార్డు తరహాలో ఉండే స్మార్ట్ రేషన్ కార్డును స్వైప్ చేస్తే లబ్ధిదారుల పేర్లు, ఆధార్ నెంబర్లు, అడ్రస్, రేషన్ దుకాణం వివరాలు వచ్చేలా కార్డును రూపొందిస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో స్మార్ట్ కార్డుతో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు.రాష్ట్రంలో మీ సేవా ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి వరకు 1.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను అధికారులు ఎంపిక చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి దరఖాస్తులను కూడా పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన వారికి దశల వారీగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయటం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.