ఎస్సీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు 18%కు పెంచాలి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలి: కవిత
హైదరాబాద్:వాయిస్ టుడే
రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్లు గత సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో స్పష్టమైందని Kalvakuntla Kavitha అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని, ఇందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
సోమవారం బంజారాహిల్స్లోని Telangana Jagruthi కార్యాలయంలో ఎస్సీ ఉప కులాల నాయకులతో సమావేశమైన కవిత, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేపట్టే జనగణన పూర్తై అధికారిక లెక్కలు ప్రకటించిన తర్వాతే రిజర్వేషన్ల పెంపు చేపడతామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ప్రకటనకు అనుగుణంగా అసెంబ్లీలో స్పష్టమైన తీర్మానం చేయాలని కోరారు.
ఎస్సీ వర్గీకరణ అమలు క్రమంలో ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు సమానంగా దక్కేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలోనూ ఉప కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.
రిజర్వేషన్ల పెంపు సహా ఎస్సీ ఉప కులాల సమస్యల పరిష్కారం కోసం దళిత సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని ఆమె స్పష్టం చేశారు. అలాగే కొన్ని ఉప కులాలకు కుల ధృవీకరణ పత్రాల జారీ విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో సుమారు 20 ఎస్సీ ఉప కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.



