డ్రగ్స్ టెస్టులకు రేవంత్ రెడీ.. కేసీఆర్, కేటీఆర్ సిద్ధమా?
హైదరాబాద్, మార్చి 17
Revanth Ready for Drug Tests… Are KCR and KTR Ready?
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ అంశంపై శాసనమండలిలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. డ్రగ్స్ వ్యవహారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా డ్రగ్ టెస్టుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారు. తొలి డ్రగ్స్ టెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి చేయించుకుంటారని మహేష్ గౌడ్ అన్నారు.‘తెలంగాణ ప్రజలకు ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలి. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయిపరం చేసిన ఘనులు బీఆర్ఎస్ నేతలు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసింది. డ్రగ్స్ కు మేం వ్యతిరేకంగా అని చెప్పేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా కూడా డ్రగ్స్ పరీక్షలకు వస్తారు. మరి బీఆర్ఎస్ నేతలు డ్రగ్స్ టెస్టుకు సిద్ధమా?. బీఆర్ఎస్ సభ్యులు తమ నాయకులైన ప్రతిపక్షనేత కేసీఆర్, కేటీఆర్లను కూడా డ్రగ్ టెస్టుకు తీసుకురాగలరా’ అని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నామని, తప్పు చేయని వారు భయపడాల్సిన అవసరం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసును అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్న బీఆర్ఎస్ ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. నేరస్తులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఈ సవాళ్లు, ప్రతిసవాళ్లతో శాసనమండలి దద్దరిల్లింది. రాజకీయ నేతల మధ్య మొదలైన ఈ ‘డ్రగ్ టెస్ట్’ వార్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ డ్రగ్స్ టెస్టుకు ఎవరు వస్తారో, ఎవరు డుమ్మా కొడతారని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, ఈ కేసుకు సంబంధించి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నివేదిక సంతృప్తికరంగా లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, తుది నిర్ణయం వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. రాజకీయ వర్గాల్లో ఈ నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది.



