హైదరాబాద్, నవంబర్ 21, (వాయిస్ టుడే): 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. ఓటర్లకు ప్రలోభాల విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఆయా రాష్ట్రాల అధికారులు, పోలీసుల సమన్వయంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టగా భారీగా అక్రమ నగదు పట్టుబడింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం రూ.1760 కోట్ల విలువైన అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, బహుమతులు, ఇతరత్రా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. అక్టోబరు 9న ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఈ మొత్తాన్ని సీజ్ చేసినట్లు తెలిపింది. 2018లో ఇవే రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీజ్ చేసిన దాంతో పోలిస్తే దీని విలువ ఏడు రెట్లని పేర్కొంది. గత ఎన్నికల్లో రూ.239.15 కోట్లు పట్టుబడినట్లు తెలిపింది. అయితే, తెలంగాణలోనే అత్యధికంగా దాదాపు రూ.659 కోట్ల మేర సీజ్ చేసినట్లు వివరించింది. రాజస్థాన్ లో రూ.650.7 కోట్లు, మధ్యప్రదేశ్ లో రూ.323.7 కోట్లు, ఛత్తీస్ గఢ్ లో రూ.76.9 కోట్లు సీజ్ చేసినట్లు వెల్లడించింది.షెడ్యూల్ లో భాగంగా ఇప్పటికే ఛత్తీస్గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. ఈ నెల 25న రాజస్థాన్ లో, 30న తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తనిఖీల సందర్భంగా తెలంగాణలోనే అత్యధికంగా నగదు పట్టుకున్నట్లు ఈసీ వెల్లడించింది. మిజోరంలో ఎలాంటి నగదు దొరకలేదని, కానీ రూ.29.82 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. తెలంగాణలో సీజ్ చేసిన నగదు మొత్తంలో రూ.225.23 కోట్ల నగదు రూపంలో ఉండగా, రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.191.02 కోట్ల విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, రూ.52.41 కోట్ల విలువైన ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వస్తువుల ఉన్నట్లు ఈసీ అధికారులు వెల్లడించారు. వీటిని సీజ్ చేసినట్లు వివరించారు. ఎన్నికలు ముగిసేనాటికి ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
8 కోట్ల చుట్టూ లెక్కలు
మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఈడీ సోదాలు కలకలం రేపాయి. వివేక ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు ఈడీ, ఐటీ అధికారులు. వివేక్తోపాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున నుంచి సోదాలు చేశారు.హైదరాబాద్లోని బంజారాహిల్స్, సోమాజిగూడ తోపాటు మంచిర్యాల జిల్లా చెన్నూరు లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కేంద్ర బలగాలతో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఈనెల 15న.. వివేక్కు సంబంధించిన కంపెనీ ఉద్యోగులు చెన్నూరుకు 50 లక్షలు తరలిస్తూ హైదరాబాద్ రామంతాపూర్లో పట్టుబడ్డారు. ఇక.. వివేక్కు సంబంధించిన కంపెనీ నుంచి 8కోట్ల రూపాయల నగదు బదిలీపై కూడా కేసు నమోదు చేసిన ఈడీ.. తనిఖీలు చేపడుతోంది. ఆన్లైన్ లావాదేవీలు భారీగా జరిగినట్టు గుర్తించింది. హైదరాబాద్లో 8కోట్ల రూపాయలను ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసినట్టు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు అందింది. బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులు… విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్… బేగంపేట్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతా నుంచి ట్రాన్స్ఫర్ చేసిన 8కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు సైఫాబాద్ పోలీసులు. దీనికి సంబంధించి ఈడీ, ఐటీ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఇవాళ తెల్లవారుజాము నుంచి వివేక్ ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ నెల 13న ఉదయం 10గంటల 57నిమిషాలకు బేగంపేటలోని హెచ్డీఎఫ్సీ బ్రాంచ్లో ఉన్న విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఒక ఖాతా నుంచి…. బషీర్బాగ్లోని ఐడీబీఐ బ్యాంకుశాఖలోని విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలోకి 8 కోట్ల రూపాయల నగదు బదిలీ అయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి సోదాలు జరిగాయి. వివేక్ వెంకస్వామి ఇళ్లు, ఆఫీసులపై ఈడీ, ఐటీ దాడులను ఆయన అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. చెన్నూలులోని వివేక్ ఇంటి దగ్గరకు భారీగా చేరుకున్న కార్యకర్తలు, అనుచరులు ఆందోళన చేస్తున్నారు. ఇందంతా రాజకీయ కుట్ర అని… ఇందులో బీఆర్ఎస్ హస్తం ఉందని వివేక అనుచరులను ఆరోపిస్తున్నారు. ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు వివేక్. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక… ఈడీ, ఐటీ దాడుల్లో ఏమేమీ స్వాధీనం చేసుకున్నారు అన్నది తేలాల్సి ఉంది.వివేక్ వెంకటస్వామి సూటు బూటు సూట్కేసులతో వచ్చి ఇతర పార్టీ నేతలను కొనుగోలు చేస్తున్నారని బీజేపీ నేత బాల్కసుమన్ ఆరోపించారు. అంతేకాదు ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. వివేక్ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు డబ్బులతో పట్టుబడటం కూడా కలకలం రేపింది. దీంతో ఈడీ, ఐటీ శాఖలకు సమాచారం ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈడీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగి రైడ్స్ చేస్తున్నట్టు సమాచారం.
అదిలాబాద్ లో 5 కోట్లు
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని పార్టీలు ఇప్పటికే పలు రకాల గిఫ్ట్ లతో పాటు విభిన్న రీతిలో నగదును అందజేస్తున్నారు. దీంతో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో పట్టుబడుతున్న నగదుతో పాటు బంగారం, బహుమతులను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే, తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రఫిక్ అనే వ్యాపార వేత్త, బీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో భారీగా నగదును ఐటీ అధికారులు పట్టుకున్నారు.బీఆర్ఎస్ నేత ఇంట్లో సుమారు 5 కోట్ల రూపాయలకు పైగా నగదు పట్టు బడినట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. డబ్బులు లెక్కించడం కోసం క్యాష్ కౌంటింగ్ మిషన్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు లోపలికి తీసుకెళ్లారు. ఎంత డబ్బును స్వాధీనం చేసుకున్నారు అనే విషయాన్ని అధికారులు ఇంకా ప్రకటించలేదు. ఉదయం నుంచి రఫిక్ జిన్నింగ్ మిల్లులో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఈ డబ్బులు ఎక్కడ నుచి వచ్చింది అంటూ ఐటీ అధికారులు బీఆర్ఎస్ నేత రఫిక్ ను ప్రశ్నిస్తున్నారు.



