హైడ్రా కూల్చివేతలపై సంజయ్ ఆగ్రహం
నిజామాబాద్, మార్చి 2
Sanjay’s anger over Hydra demolitions
హైదరాబాద్ నగరంలో హైడ్రా పేదల ఇళ్ళను కూల్చుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లను నిర్మిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కూల్చివేత ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. హైడ్రాకు పెద్దవాళ్ల ఇళ్లు కనిపించడం లేదని ఆరోపించారు. కేవలం పేదల ఇళ్లు మాత్రమే కూల్చుతున్నారని అన్నారు.కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ, బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో ఉన్న ఎన్ని ఇళ్లను కూల్చివేశారో లెక్కలు తీయడానికి సిద్ధమా అని సవాల్ చేశారు. మూసీ ఒడ్డున గాంధీ విగ్రహం పేరిట, ఖమ్మంలో భూదాన్ పేదల ఇళ్ల కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. హిందువులు రోడ్ల మీదకు వచ్చి కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మెడలు వంచాల్సిందేనని అన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి దాడులను భరిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బొట్టు పెట్టుకుని దేవుడిని మొక్కడంతో సరిపోదని అన్నారు. దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు స్పందించని వాడు హిందువే కాదని బండి సంజయ్ అన్నారు.ముత్యాలమ్మ గుడి మీద దాడి చేసినా, మరే గుడిపై దాడి చేసినా స్పందించేది బజరంగ్ దళ్, హిందూవాహిని, హిందూ సంస్థలు, బీజేపీ మాత్రమే అన్నారు. కానీ సామాన్య హిందూ సమాజం ఇలాంటి దాడులను ఖండించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సువాడలో అమాయకులైన హిందూ యువకులను అరెస్టు చేసి జైల్లో పెడితే వారి కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయని అన్నారు.చాంద్రాయణగుట్టలో చారిత్రాత్మక హనుమాన్ దేవాలయంపై దాడి జరిగితే కూడా హిందువులు బయటకు రావడం లేదని అన్నారు. ఇదేం పద్ధతి… హిందూ సమాజం ఇలాంటి దాడులను ఇంకా ఎన్నాళ్లు భరిస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని అన్నారు. తాను ఇతర ప్రార్థనాలయాల గురించి మాట్లాడటం లేదని, కానీ హిందువుగా తమ దేవాలయంపై దాడి జరుగుతుంటే ప్రశ్నిస్తున్నానని అన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలోని హిందూ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారి అర్థం చేసుకోవాలని, దేవాలయాలపై దాడులు జరుగుతుంటే స్పందించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అన్ని పార్టీల జెండాలు పక్కన పెట్టి కేవలం కాషాయ జెండాను పట్టుకుని కొట్లాడుదామని పిలుపునిచ్చారు. బాన్సువాడలో జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు.



