- Advertisement -
మహిళలకు కుట్టుమిషన్లు…
Sewing machine for women
నల్గోండ, జనవరి 25, (వాయిస్ టుడే)
తెలంగాణలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రకరకాల పథకాలు అమలు చేస్తోన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మరో వినూత్న పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే తమ లక్ష్యమని పదే పదే చెప్తున్న ప్రభుత్వం.. మహిళలంతా తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న ఆలోచనతో అందరికీ ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా.. మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు.. ఉచితంగా కుట్టు మిషన్లను అందించనున్నారు. అర్హులైన వారు నేరుగా ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ కుట్టుమిషన్లను ఇప్పటికే కుట్టుపనిలో ట్రైనింగ్ పొందిన.. ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైనులు, పార్సీ లాంటి మతాలకు చెందిన మైనార్టీ మహిళలకు మాత్రమే ఇస్తారు.
ఈ ఉచిత కుట్టు మిషన్లు పొందేందుకు కావాల్సి అర్హతలు ఇవే:
మహిళ కనీసం 5వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి.
బాప్టిజం, బీసీ-సీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
కుట్టుపనిలో ట్రైనింగ్ పొందిన సర్టిఫికెట్ ఉండాలి. TGCMFC అనుబంధంగా ఉన్న సంస్థల నుంచి శిక్షణ పొందిన వారు కూడా ఇందుకు అర్హులే.
21 నుంచి 55 సంవత్సరాల వయస్సు వారై ఉండాలి.
తెల్ల రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉండాలి లేదా ఆదాయ దృవీకరణ పత్రం ఉండాలి. తప్పనిసరిగా నిరుద్యోగులై ఉండాలి.
కుటుంబ సంవత్సర ఆదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు గానూ.. పట్టణాల్లో రూ.2 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
- Advertisement -



