అరవ శ్రీధర్ కు నిద్ర లేని రాత్రులు..
కడప, ఫిబ్రవరి 2, (వాయిస్ టుడే )
Sleepless nights for Arava Sridhar..
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో బాధితులు ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. రోజుకొక వీడియోతో ఆయనకు నిద్ర లేకుండా చేస్తోంది. ఓవైపు అధికారికంగా విచారణ సాగుతున్న టైంలోనే ఇలా ఒక్కో వీడియోతో సంచలనం రేపుతోంది. ఆమె డీఫ్ఫేక్ వీడియోలతో అసత్య ఆరోపణలు చేస్తుందని ఎమ్మెల్యే వర్గం కవర్ చేస్తుంటే ఆమె మాత్రం తన వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే వీడియోలు రిలీజ్ చేస్తోంది. తాజాగా అసెంబ్లీ నుంచి బాధితురాలికి వీడియో కాల్ చేసి మాట్లాడుతున్న ఎమ్మెల్యే వీడియో వదిలారు బాధితురాలు. తాజాగా బయటపడిన వీడియో వివరాల ప్రకారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే అరవ శ్రీధర్ బాధితురాలితో వీడియో చాటింగ్ చేస్తున్నట్టు ఉంది. సభలో ప్రజా సమస్యలు లేవన్నట్టు అసెంబ్లీ ప్రాంగణం నుంచే మహిళకు వీడియో కాల్ చేసి అసభ్యకరమైన రీతిలో మాట్లాడటంపై వైసీపీతోపాటు నార్మల్ నెటిజన్లు ఆన్లైన్లో విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ గౌరవ మర్యాదలు కాలరాస్తున్నారని మండిపడుతున్నారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యేగా ఉన్న అరవ శ్రీధర్ తనను రేప్ చేసి ఐదు సార్లు అబార్షన్ అయ్యేలా చేశారని బాధితురాలు నాలుగు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చారు. తన అధికారాన్ని అడ్డంపెట్టుకొని తనను వేధింపులకు దిగారని ఆరోపించారు. దీనిపై పార్టీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని అందుకే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె తన వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తాను డబ్బుల కోసమే, లేకుండా ఎమ్మెల్యేను పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో ఇదంతా చేయలేదని, తనకు న్యాయం జరగాలని ఆయనకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. తాను పాతిక కోట్లు డిమాండ్ చేసిందని అబద్దమని చెప్పారు. తన వెనుక వైసీపీ ఉందనే ప్రచారాన్ని కూడా బాధితురాలు ఖండించారు. ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన తప్పు లేదని తనను బ్లాక్ మెయిల్ చేయడానికి సదరు మహిళ డీప్ఫేక్ వీడియోలతో పరువు తీస్తున్నారని ఆరోపించారు. కచ్చితంగా మహిళ అసలు రూపం తెలుస్తుందని అన్నారు. ఇంతలో జనసేన పార్టీ కూడా ఈ వివాదంపై స్పందించి విచారణకు కమిటీ వేసింది. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణ పూర్తి అయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేకు సూచించారు. అయితే ఈ వివాదం మొదలైనప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది
రంగంలోకి హ్యూమన్ రైట్స్ కమిషన్
వివాదం దుమారం రేపడంతో జనసేన పార్టీ అంతర్గత విచారణకు ఆదేశించింది. పార్టీ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని సమాచారం. ఇప్పటివరకు బయటకు వచ్చిన వీడియోలు, అందులో కనిపిస్తున్న అంశాలు, వాటి నిజానిజాలపై కమిటీ సమగ్రంగా పరిశీలన జరుపుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు ఆరోపణలు చేసిన వీణను కూడా కమిటీ ప్రత్యక్షంగా కలసి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి తొలి వారంలో జనసేన అంతర్గత విచారణ కమిటీ రైల్వే కోడూరు ప్రాంతంలో పర్యటించనుందని సమాచారం. అక్కడ స్థానిక స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి, సంబంధిత వ్యక్తులతో మాట్లాడి ఒక నివేదిక సిద్ధం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ నివేదిక ఆధారంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు ఏవైనా ఉంటే తీసుకుంటామని స్పష్టంగా తెలియజేశారు. ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే సమాచారం సేకరించారని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు.ఇదిలా ఉండగా, ఈ వ్యవహారం మరో కీలక దశకు చేరింది. వీణ తాజాగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయించారు. తనపై లైంగిక దాడి జరిగిందని, పెళ్లి హామీతో మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఫిర్యాదును ఆమె తరఫున న్యాయవాది ఆజాద్ దాఖలు చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణకు అంగీకరించడంతో ఈ కేసు జాతీయ స్థాయిలోనూ దృష్టిని ఆకర్షిస్తోంది.అదే సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా స్పందించారు. ఆమె వీణతో ఫోన్లో మాట్లాడి ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలిపారు. ఈ ఘటనలో నిజాలు వెలికి తీసి బాధితురాలికి న్యాయం చేయడానికి కమిషన్ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ పరిణామాలన్నింటితో ఈ వ్యవహారం కేవలం రాజకీయ అంశంగా కాకుండా, చట్టపరమైన,మానవ హక్కుల కోణంలోనూ కీలకంగా మారింది. అంతర్గత పార్టీ విచారణ, జాతీయ మానవ హక్కుల కమిషన్ చర్యలు, మహిళా కమిషన్ స్పందన నేపథ్యంలో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.



