మేజర్ గ్రామపంచాయతీ నందు మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
Steps should be taken to establish infrastructure in Major Gram Panchayatతాగునీరు, వీధిలైట్ల ఏర్పాటులో పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్య వైఖరి సరికాదు
సమస్యల పరిష్కారం పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి పై ఎంపీడీవో కి స్పందన కార్యక్రమంలో సిపిఐ బృందం వినతిపత్రం.
దేవనకొండ సెప్టెంబర్ 30
మండల కేంద్రమైన దేవనకొండ నందు కనీస మౌలిక వసతుల నిర్వహణ లోపం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ మండలం ప్రధాన కార్యదర్శి ఎమ్. నరసరావు, సిపిఐ మండల నాయకులు వై. కండప్ప లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం స్పందన కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఎంపీడీవో గారిని కలిసి మండలంలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అనంతరం వారు మాట్లాడుతూ… మేజర్ గ్రామపంచాయతీ నందు 14 వార్డులు ఉన్నప్పటికీ చాలా వార్డుల నందు డ్రైనేజీ కాలువలు లేక రోడ్ల పైననే మురుగునీరు ప్రవహించి దుర్గంధ భరితంగా ఉన్నదన్నారు. అలాగే సి.సి రోడ్లు లేకపోవడం వలన వర్షాలు వస్తే రోడ్లన్నీ జలమయమై కాలనీ ప్రజలు నడవలేని పరిస్థితిలో కొన్ని వార్డులు ఉన్నాయన్నారు. అలాగే కొన్ని కాలనీల నందు వీధిలైట్లు లేక రాత్రి సమయంలో వీధి కుక్కల బెడదతో పాటు విష సర్పాలు సంచరించడం వలన వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీధిలైట్లు ఏర్పాటు చేయాలని గతంలో అనేకమార్లు పంచాయతీ కార్యదర్శిని,ఎంపీడీఓ కార్యాలయ అధికారులను కోరినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులకు సిఫారసు చేసి చేతులు దులుపుకోవడం తప్ప పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. విద్యుత్ స్తంభాలు, వీధిలైట్లు ఏర్పాటు చేసే విషయంపై గ్రామపంచాయతీ కార్యదర్శిని పలుమార్లు కోరగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగిందన్నారు. వీధిలైట్లు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలన్నారు.దేవనకొండ మేజర్ గ్రామపంచాయతీ నందు గత కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన ఇనుప విద్యుత్ స్తంభాల వల్ల ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నందున వాటి స్థానంలో నూతన (సిమెంట్) విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు.గ్రామంలో చెత్తాచెదారం వేయుటకు డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి మేజర్ గ్రామపంచాయతీలో సేకరించిన చెత్తాచెదారంను డంపింగ్ యార్డ్ నందు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంత మార్కెట్ కు ప్రహరీ గోడ నిర్మించి మార్కెట్ నందు షెడ్డులు ఏర్పాటు చేసి ప్రజల అవసరాలు తీర్చాలన్నారు. గ్రామపంచాయతీ నందు తాగునీటి అవసర నిమిత్తం ఏర్పాటు చేసిన పైప్ లైన్లు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల పైపులకు లీకులు ఏర్పడి కలుషిత నీరు వచ్చే అవకాశం ఉన్నందున తాగునీటి పైప్ లైన్ వ్యవస్థను క్రమపద్ధతిలో నిర్వహించాలన్నారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ ని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి వి. రాజశేఖర్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రామాంజి, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి భాస్కర్, సిపిఐ నాయకులు నాగన్న, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.




