చెన్నై: భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. 98 ఏళ్ల వయసున్న స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో ఈ రోజు తుది శ్వాస విడిచారు..
1925 ఆగష్టు 7న మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణం ప్రాంతంలో స్వామినాథన్ జన్మించారు. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు విశేష కృషి చేశారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు. ఇది భారతదేశంలోని తక్కువ ఆదాయ గల రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడింది.
స్వామినాథన్ 1987లో చెన్నైలో ఎం ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించారు. దాని ద్వారా ఆయన మొదటి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు. స్వామినాథన్ అనేక అవార్డులను అందుకున్నారు. 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1986లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు అందుకున్నారు..
ఛెన్నై, సెప్టెంబర్ 28: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్ఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. ఉదయం 11.20 నిముషాలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1925 ఆగస్టు 7న జన్మించారు స్వామినాథన్. వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆకాంక్షించిన ఆయన చివరి శ్వాస వరకూ అందుకోసమే కృషి చేశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న డిమాండ్ని తెరపైకి తీసుకురావడమే కాకుండా అందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. 2006లో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ పలు సిఫార్సులు చేస్తూ ఓ నివేదిక విడుదల చేసింది. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. దీంతో పాటు మరి కొన్ని సిఫార్సులు చేసింది. ఇప్పటికీ వ్యవసాయ రంగంలో ఈ కమిటీ ఇచ్చిన నివేదికనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. హరిత విప్లవ పితామహుడిగానూ పేరు సంపాదించుకున్నారు ఎమ్ఎస్ స్వామినాథన్. వృద్ధాప్యం కారణంగానే ఆయన మృతి చెందినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. 1972 నుంచి 1979 వరకూ ‘Indian Council of Agricultural Research’ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు స్వామినాథన్. ఎమ్ఎస్ స్వామినాథన్ పూర్తి పేరు మంకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఆయనకు ముగ్గురు కూతుర్లు. సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యారావ్. వీరిలో సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో చీఫ్ సైంటిస్ట్గా పని చేశారు. 1987లో International Rice Research Institute (IRR) కి డైరెక్టర్ జనరల్గా పని చేశారు. ఆ సమయంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన World Food Prize ఆయనని తొలిసారి వరించింది. నోబెల్ ప్రైజ్ ఎలాగో..వ్యవసాయ రంగంలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అలా. జీవితమంతా వ్యవసాయ రంగానికే అంకితం చేసిన స్వామినాథన్ని మొత్తం 40 అవార్డులు వరించాయి. 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంబకోణంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఎమ్కే సాంబశివన్, పార్వతి తంగమ్మల్. తండ్రి ఎమ్కే సాంబశివన్ ఓ సర్జన్. కొడుకు కూడా మెడిసిన్ చదివితే బాగుంటుందని తండ్రి కోరుకున్నారు. కానీ…స్వామినాథన్ మాత్రం అందుకు ఆసక్తి చూపించలేదు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఈ రంగంలోకి వచ్చారు. దేశవ్యాప్తంగా అందరికీ సరిపడ ఆహారం అందాలన్నదే ఆయన లక్ష్యం.1943లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్లో తీవ్ర కరవు వచ్చింది. ఆ సమయంలో ప్రజలు తిండి లేక అల్లాడిపోయారు. ఈ పరిస్థితులను చాలా దగ్గర నుంచి చూసిన స్వామినాథన్..అప్పుడే తాను వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. భారత ప్రభుత్వం స్వామినాథన్ని పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇక అంతర్జాతీయ అవార్డుల విషయానికొస్తే…1971లో Ramon Magsaysay Award, 1986లో Albert Einstein World Science Award అవార్డులు వరించాయి. 20వ శతాబ్దపు ప్రముఖ ఆసియా వ్యక్తుల్లో ఒకరిగా Time Magazine లో చోటు దక్కించుకున్నారు. 1999లో ఇందిరా గాంధీ శాంతి బహుమతి లభించింది.
ఆకలి చావులు లేని రాజ్యం కావాలి
అవి స్వాతంత్య్రం వచ్చిన రోజులు. దేశంలో ఆహార కొరత ఉంది. ఆకలితో కోట్ల మంది చనిపోతున్నారు. విదేశాల నుంచి ఆహార ధాన్యాలు తెచ్చుకోవాలంటే దేశం దగ్గర డబ్బులు లేవు.. దేశంలో కావాల్సినంత భూమి.. రైతుల్లో సత్తా ఉంది.. కాకపోతే మార్గ నిర్దేశం లేదు. ఇలాంటి సమయంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు అవసరం అని భావించారు స్వామినాథన్. అప్పటికే వ్యవసాయ రంగంపై విదేశాల్లోనూ పరిశోధనలు చేసిన అనుభవం ఉండటంతో.. అప్పటి కేంద్ర ప్రభుత్వాలు స్వామినాథన్ కు బాధ్యతలు అప్పగించాయి. దేశంలో ఆకలి చావులు ఉండకూడదు అంటే వెంటనే తక్కువ సమయంలో.. తక్కువ విస్తీర్ణంలో.. ఎక్కువ పంటలు పండే విత్తనాలు కావాలని భావించారు. ఈ క్రమంలోనే మొదటగా నాలుగు ఆహార పంటలపై దృష్టి పెట్టారు. వరి, గోధుమ, ఆలు గడ్డ, జనుము పంటల సాగును ప్రోత్సహించారు. ఎక్కువ పంట దిగుబడి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొత్త విత్తనాలను తయారు చేశారు. దీని వల్ల ఐదేళ్లలోనే అంటే 1957 నుంచి 1965వ సంవత్సరం నాటికి.. అంటే ఏడేళ్లలోనే భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రతి ఒక్కరికీ బియ్యం, గోధుమలతోపాటు కనీస కూరగాయ అయిన ఆలు గడ్డలు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా ఆకలి చావులు తగ్గాయి. ఏదో ఒక పంట అని కాకుండా.. జనం బతకటానికి కావాల్సిన కనీస ఆహార పంటల్లో వరి, గోధుమ, ఆలు గడ్డలో ఆయన చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. అప్పటి వరకు ఆరు నెలలుగా ఉన్న వరి పంట.. స్వామినాథన్ ప్రయోగాలతో 90 రోజులకు తగ్గింది. దీంతో రెండు పంటల వైపు రైతులు మళ్లారు. దిగుబడులు పెరిగాయి.. అందరికీ ఆహారం అందుబాటులోకి వచ్చింది. ఎండ, వానలకు తట్టుకుని నిలబడే సరికొత్త వంగడాలను సృష్టించారు. అదే విధంగా తక్కువ నీళ్లు ఉన్నా.. పంట దిగుబడికి ఢోకా లేని గోధుమ వంగడాలపై విస్తృతమైన ప్రయోగాలు చేశారు. ఎకరా భూమిలో 30, 40 బస్తాల ధాన్యం వచ్చే వంగడాల సృష్టికి సైతం ఆద్యుడు స్వామినాథన్. ఆ తర్వాత ఈ ప్రయోగాలను అక్కడితో నిలిపివేయకుండా.. మిగతా అన్ని పంటలకు విస్తరించారు. తద్వారా అప్పటి వరకు ప్రపంచ దేశాల్లో మన వ్యవసాయ రంగంపై ఉన్న చులకన భావన పోయింది. అప్పట్లో స్వామినాథన్ ఆలోచనే.. ఇప్పటికీ దేశం ఆచరిస్తుంది.. ఆచరణలో పెడుతుంది అంటే.. స్వామినాథన్ ముందు చూపు.. దార్శినికత, వ్యవసాయంపై.. రైతులపై ఆయనకు ఉన్న మక్కువను తెలియజేస్తుంది. భారత రత్న తప్పితే.. మిగతా అన్ని పురస్కారాలు ఆయనకు దక్కాయి



