మా గోడు పట్టించుకోండి
భద్రాచలం విలీన గ్రామాల నేతలు
హైదరాబాద్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలపాలని స్థానిక నేతలు, ప్రజలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. ఈ మేరకు భద్రాచలం విలీన గ్రామాల నేతలు హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలోనే విలీనం చేయాలని వారు మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 6వ తేదీన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో విలీన ప్రతిపాదనను వారి ముందు పెట్టాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానని, మరోసారి సీఎం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తానని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక సమస్యలపై మంత్రికి విలీన గ్రామాల ప్రజలు వివరించారు.
భద్రాచలం,చర్ల ప్రధాన రహదారిలో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఎటపాక ఆర్ అండ్ బీ రోడ్డు దుస్థితిని ఆయనకు వివరించారు. రోడ్డు పరిస్థితి దారుణంగా ఉందని, ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి ఏపీ ఆర్ అండ్ బీ సీఈతో ఫోన్లో మాట్లాడారు. మరమ్మతులు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని అధికారిని కోరారు. విలీన గ్రామాల రైతులకు రుణమాఫీ విషయంలో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా చూడాలని మంత్రిని నేతలు కోరగా.. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారికి సూచించారు.
మా గోడు పట్టించుకోండి
- Advertisement -
- Advertisement -