మాజీ మంత్రి పెద్దిరెడ్డి కంచుకోటలో టీడీపీ మాస్టర్ ప్లాన్!
TDP Master Plan in Peddireddy Kanchukota!
చిత్తూరు, ఆగస్టు 5: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బృందంతో కూడిన టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఆవులపల్లి ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై రైతులతో క్షేత్రస్థాయి పర్యటనలో ముఖాముఖి నిర్వహించనున్నారు. పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలపై ఆయన కంచుకోట అయిన పుంగనూరులో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్ల రామచంద్రారెడ్డితో పాటు పలువురు టిడిపి బృందం కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు.
కాగా.. టీడీపీ శ్రేణుల క్షేత్రస్థాయి పర్యటనలపై రెండు రోజుల క్రితం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలు, భూముల దందాపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలను బయటకు తీసే క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుడుతున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఇటీవల మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో 22ఏ భూముల రికార్డులు అగ్నిఆహుతైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని రికార్డులను కాల్చివేశారని ప్రచారం జోరుగా సాగింది. పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబ అక్రమాలు, అరాచకాలు వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని ఐదేళ్లు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు. పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో మోసపోయిన బాధితులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి భారీగా చేరుకుని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా బాధితుల వినతిపత్రాలు స్వీకరించారు. అయితే ఫైళ్ల దహనం ఘటనపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మదనపల్లి డివిజన్లోని 11 మండలాల తహసీల్దార్లతో సిసోడియా సమావేశమయ్యారు. ఫైళ్ల దహనం ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది.



