Sunday, September 8, 2024

తెలంగాణ బాపు …

- Advertisement -

తెలంగాణ బాపు …
ఇమేజ్ కోసం గులాబీ యత్నాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 19
రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది అద్భుతమైన ఆయుధం.. అధికారాన్ని ఇట్టే
తెచ్చి పెడుతుంది. ఈ విషయంలో భారత రాష్ట్ర సమితిగా మారిన భారత రాష్ట్ర
సమితి నేతలకు ప్రత్యేకమైన అనుభవం ఉంది. అయితే ఆ విషయంలోనే వారు
తప్పటడుగులు  వేశారన్న అబిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆ విషయం  పక్కన
పెడితే.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ప్రత్యేకమైన  వ్యక్తిగా
గుర్తుంచుకోవాలన్న మిషన్ ను బీఆర్ఎస్ ప్రారంభించింది. ఆయనను తెలంగాణ
బాపుగా ప్రసిద్ధి చేసేందుకు పుట్టిన రోజు వేడుకల కేంద్రంగా ప్రయత్నాలు
ప్రారంభించింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాతిపిత బాపూ అంటూ సరికొత్త
ప్రచారాన్ని ప్రారంభించారు  తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదినం సందర్భంగా శనివారం ఆయన
నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాతిపిత బాపూ పేరిట సరికొత్త
ప్రచారం సాగించారు.  తెలంగాణలో ఓటమి పాలవడంతోపాటు అధికార కాంగ్రెస్
పార్టీ నేతల నుంచి కాళేశ్వరం నుంచి కృష్ణ జలాల వరకు విమర్శల వర్షం
కురుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రతిష్ఠ పెంచేందుకు బీఆర్ఎస్ నాయకులు
బాపూ ప్రచారంతో ముందుకు వెళుతున్నారు. తెలంగాణ సిద్ధించిన పదేళ్ల తర్వాత
కూడా మళ్లీ తాజాగా తెలంగాణ సెంటిమెంటును రగిలిస్తున్నారు. చావు నోట్లో తల
పెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా, బాపూ అని
పిలవడం ఆయనకు మనం ఇచ్చే గౌరవమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
చెప్పారు. తెలంగాణలో గతంలో కొండా లక్ష్మణ్ బాపూజీని మాత్రమే బాపూ అని
పిలిచే వారు. కానీ ప్రస్థుతం ఆ బాపూ పేరును కేసీఆర్ కు కొత్తగా
చేర్చారు.కేసీఆర్ 2001వ సంవత్సరం ఏప్రిల్ 7వతేదీన తెలంగాణ రాష్ట్ర
సమితిని స్థాపించారు. తెలంగాణ బతుకులు…బొగ్గుబాయి, బొంబాయి.. దుబాయి
అన్నట్లు తయారైనయ్ అని తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించిన కేసీఆర్ ఓటమి
అనంతరం, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సరికొత్త రాజకీయ
వ్యూహాలు పన్నుతున్నారు. గతంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా నేతలు ఆయన్ను
కలిసి పదవులు పొందేందుకు శుభాకాంక్షలు తెలిపేవారు. సీఎంగా ఉన్నపుడు
కేసీఆర్ జన్మదినోత్సవాలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగేవి. కానీ ఈ సారి ఓటమి
పాలవడంతో కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కేసీఆర్
వేడుకలకు దూరంగా ఉన్నా, ఆ పార్టీ నేతలు మాత్రం మన తెలంగాణ బాపూ అంటూ
ప్రచార హోరు సాగించారు.  కేసీఆర్ బాపూ ప్రచారం శనివారం వాట్సప్, ఫోన్
కాల్స్ ద్వారా ముమ్మరం చేశారు. కరవు నేలను సిరుల మాగాణం చేసిన ‘‘తెలంగాణ
బాపు’’ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70 జన్మదినం సందర్భంగా ఆయన్ని విష్
చేసేందుకు +91 70703 57070 ఫోన్ నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి, ధన్యవాదాలు
అంటూ వాట్సాప్ ద్వారా శనివారం తెలంగాణ వ్యాప్తంగా వాట్సాప్ మెసేజులు
వచ్చాయి. ఆ ఫోన్ నంబరుకు రింగ్ మిస్డ్ కాల్ చేస్తే చాలు వెంటనే ‘‘ప్రతీ
తెలంగాణ బిడ్డకు పేరుపేరునా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞతలు,
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’అంటూ కేసీఆర్ తన వాయిస్ వినిపించారు.కోట్ల
మంది కలల తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన మహానాయకుడు, ఉద్యమ నేలను
ఉద్యానవనంగా మార్చిన దార్శనికుడు, తెలంగాణ రాష్ట్ర గతిని మార్చి చరిత్ర
లిఖించిన కార్యసాధకుడు మన తెలంగాణ బాపు కేసిఆర్ గారు.’’ ‘‘బాపూ… సబ్బండ
కులాల ఆశాదీపం మీరు, సకల జనుల ఆకాంక్షల ఆలంబన మీరు, నిరాశా నిస్ప్రహలను
తరిమే చైతన్యపు కాగడా మీరు, ఉషోదయాలకు తొలిపొద్దు మీరు, నాడు ప్రాణాలను
ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చింది మీరు’’ వాన్ గార్డ్ ఆఫ్ తెలంగాణ…వెలుగు
దివిటి కేసీఆర్ అంటూ ‘‘కుట్రలు, కుతంత్రాలకు, ప్రలోభాలకు లొంగని, జంకని
తెలంగాణ పక్షపాతివి…తెలంగాణ పితామహుడు మన తెలంగాణ జాతిపిత బాపూ’’ అంటూ
బీఆర్ఎస్ నేతలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు.  కేసీఆర్ 70 వ జన్మదినం
సందర్భంగా తెలంగాణ సెంటిమెంటును రగిల్చేలా, కేసీఆర్ ప్రతిష్ఠ పెంచేలా
ఆడియో, వీడియో పాటల ద్వారా ప్రచారం సాగించారు. ‘‘ఉక్కు గుండెను
ఒక్కసారన్నా తాకాలని ఉన్నదే. ఆ బక్కపల్చని పెయ్యి హత్తుకోవాలని ఉన్నదే…
ఆ నాటి గురుతులు ఒక్కొక్కటి ఏరుకొని రాశులు పోయాలని ఉన్నదే సావు
అంచులకెళ్లి సాధించే రాష్ట్రాన్ని సారూ కేసీఆర్ చరితను తెలుసుకోవాలని
ఉన్నదే మదినిండా తెలుసుకోవాలని ఉన్నదే’’ అంటూ పాటలను విడుదల చేశారు.
కేసీఆర్‌ పదేళ్ల పాలనపై, కాళేశ్వరం అవినీతి దందాపై కాంగ్రెస్‌ నాయకులు
విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆయన ఇమేజ్‌ను పెంచేందుకు, తెలంగాణ
బాపూగా ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ
నేతగా బాపూగా ప్రచారం సాగిస్తూ బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మక అడుగులు
వేస్తున్నారు. ప్రజలు సైతం కేసీఆర్‌ను బాపూగా పిలిచేలా ఫేస్‌బుక్‌,
ట్విటర్‌ ఖాతాల్లో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పోస్టులు పెడుతున్నారు.
కేసీఆర్‌ ఒక పార్టీ నాయకుడే కాదని, యావత్‌ తెలంగాణ సమాజానికి జాతిపిత
బాపూ అని అంటున్నారు.ఈ ప్రచారం ముందు ముందు మరింత ఎక్కువగా జరిగే
అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రచారం బీఆర్ఎస్‌కు ఎంత మేలు చేస్తుందో చూడాల్సి
ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్