ఐలమ్మ 129 వ జయంతి
అగ్ని కణం ఐలమ్మ.
The Agni particle is Ailamma.
ఐలమ్మ పుట్టుక- (సేకరణ ఏనుగుల వీరాంజనేయులు సీనియర్ జర్నలిస్టు). జనగాం జిల్లా, రాయపర్తి మం”, కృష్ణారం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలు దంపతులకు 1895 లో జన్మించింది. చిట్యాల నరసయ్యను వివాహమాడి, పాలకుర్తి చేరుకుంది. అప్పటికే గ్రామాలలో – ముస్లిం రాజును చూపించి- హిందూ దొరలు, పటేల్, పట్వారిలు ప్రజలను పీడించి, శిస్తుల పేరుతో వసూళ్లు చేసి, జల్సాగా బ్రతికేవారు. వెట్టి చాకిరి తో సకల చేతివృత్తుల వారు హింసింపబడ్డారు. ఉదా: దొరవారి గుర్రం బండి ముందు చాకలి పరిగెత్తాలి. పరుగెత్త లేనప్పుడు దొర గుర్రం బండితో తొక్కించేవాడు. వెంటనే మరొక చాకలి బండి ముందు పరిగెత్తాలి.( అందుకుగాను బండి వెనక 4గురు వస్తుండేవారు). అప్పటికే నైజాం ప్రాంతంలో నిషేధిత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభ, సంఘం పేర్లతో చైతన్యం చేయసాగారు. రాత్రి పాఠశాలల ద్వారా వెట్టి చేయవద్దని, బలవంతపు శిస్తులను వ్యతిరేకించాలని బోధించేవాళ్లు. ఐలమ్మ భర్త, పిల్లలు వెట్టిచాకిరికి పోగా ఐలమ్మ ఊరిలో బట్టలుతికితే వచ్చే అన్నం అందరికీ సరిపోయేది కాదు. అందుకు అయిలమ్మ కౌలు వ్యవసాయం మొదలుపెట్టింది. అది గిట్టని ఆ ఊరు పట్వారి ఐలమ్మను కూడా తన ఇంటికి వెట్టికి రమ్మన్నాడు. అందుకు అయిలమ్మ వ్యతిరేకించింది.
( అప్పటికే ఐలమ్మకు రాత్రి పాఠశాలలలో కమ్యూనిస్టులు చెప్పే వెట్టి నిరాకరణ తలకెక్కింది)
కానీ పట్వారి వెట్టి నిరాకరణ పై ‘విసునూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి’ దొరకు పితురీలు చెప్పాడు, ఐలమ్మ కమ్యూనిస్టు అని, వాళ్ళకి అన్నం పెట్టుద్దని చెప్పాడు. రామచంద్రారెడ్డి దొర చాలా దుర్మార్గుడు. అతని గడిలో గుండాలు, రజాకార్లు ఉండేవాళ్ళు.( రజాకార్ సైన్యానికి రామచంద్రారెడ్డి ఉపాధ్యక్షుడు. అధ్యక్షుడు ఖాసింరజ్వీ హైదరాబాదులో ఉంటాడు). రామచంద్రారెడ్డి దొర తన గడీ లోని రజాకారులను పంపి, ఐలమ్మ ఇల్లును లూటీ చేయించాడు. అడ్డొచ్చిన ఐలమ్మ భర్త, కొడుకులను పోలీసుల చేత తప్పుడు కేసులో ఇరికించి, జైలుకు పంపాడు. తదుపరి రాంచంద్రారెడ్డిదొర ఐలమ్మ వరి పొలంను కోసుకు రమ్మని తన గుండాలను, రజాకార్లను పంపాడు. అప్పుడు ఐలమ్మ కమ్యూనిస్టు నాయకులను సహాయం కోరగా, కమ్యూనిస్టులు దొర గుండాలను పారద్రోలి, వరి పంటను కైలు చేసి, వడ్లను ఐలమ్మ ఇంటికి చేర్చారు. ఇది చూసిన ప్రజానీకం కమ్యూనిస్టులను అనుసరించారు. ఐలమ్మ తన సగం ఇంటిని కమ్యూనిస్టు ఆఫీసుగా ఇచ్చింది. రామచంద్రారెడ్డి నైజాం ప్రభువు ను సహాయం కోరగా, నైజాం సైన్యాన్ని పంపాడు. ఆ సైనిక తుపాకులను ప్రజానీకం కారంపొట్లాలతోనూ, ఒడిసెలలతోనూ ఎదుర్కొని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. తదనంతరం ఐలమ్మ భర్త, కొడుకులు కమ్యూనిస్టు దళ నాయకులుగా – ‘నైజాం వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటం’ మొదలైంది. చివరకు నైజాం గద్దె దిగటం జరిగింది. నైజాం ప్రభువును కుప్పకూల్చిన ‘అగ్ని కణం’ మన ఐలమ్మ.



