మా పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చింది
కవిత
The government yielded as a result of our struggles.
— Kavitha
హైదరాబాద్
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 750 మంది పేదల ఇండ్లను కూలగొట్టిన అరాచక కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డా. విశారధన్ మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన సంయుక్త పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చిందని జాగృతి అధినేత కవిత అన్నారు.
ఇండ్లు కూల్చేసిన వారిలో 411 మందికి పట్టాలు ఇస్తామని ప్రకటించింది.. ప్రజా పోరాటాలు తప్పక విజయం సాధిస్తాయనే విషయం నిరూపితమైంది. 750 మంది ఇండ్లు కూల్చివేసి కేవలం 411 మందికి మాత్రమే పట్టాలు ఇవ్వడంతో మిగతా బాధితుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అన్యాయం జరిగిందనే భావన వారిలో నెలకొన్నదని అన్నారు.
పట్టాల పంపిణీలో పారదర్శకత ఉండాలని, ప్రతి బాధితుడికి న్యాయం జరగాలనే లక్ష్యంగా వెలుగుమట్ల బాధితుల కోసం నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశాము. రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీలో ఆర్మీ మాజీ అధికారి, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు భాగస్వాములు కావడం సంతోషంగా ఉంది. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వం వెంటబడుతుంది. నిజ నిర్ధారణ కమిటీకి ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు సంపూర్ణంగా సహకరించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. .



