గవర్నర్ ప్రసంగం
తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న సంకల్పానికి ప్రతిబింబం
మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్
The Governor’s Address:
A Reflection of the Government’s Resolve Towards Telangana’s Development
— Minister Vakiti Srihari
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేసిన ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు, సంకల్పం మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు స్పష్టమైన ప్రతిబింబంగా నిలిచిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ…తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి, సంక్షేమం మరియు పారదర్శక పాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలు ప్రస్తావించబడ్డాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యా మరియు వైద్య రంగాల అభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా ప్రతిబింబించాయని మంత్రి చెప్పారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా లక్షలాది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి నిర్ణయాలు సామాన్య కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తున్నాయని అన్నారు.
రైతుల అభ్యున్నతి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రైతులపై అప్పుల భారం తగ్గించేందుకు రైతు రుణమాఫీ అమలు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి సాగునీటి వనరుల అభివృద్ధి మరియు ఆధునిక సాంకేతికత వినియోగంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
యువత అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని మంత్రి శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు వేగవంతం చేయడంతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువతకు సరైన అవకాశాలు కల్పించడం ద్వారా తెలంగాణను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
యువజన సర్వీసులు మరియు క్రీడల శాఖ తరఫున రాష్ట్రంలో క్రీడలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, శిక్షణా కార్యక్రమాలు మరియు ప్రోత్సాహక చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి వివరించారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
తెలంగాణను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడం, ప్రతి వర్గానికీ సంక్షేమ ఫలితాలు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు



