టీజేపీకి లైన్ క్లియర్
హైదరాబాద్, మార్చి 21, (వాయిస్ టుడే)
The path is clear for TJP.
తెలంగాణ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇప్పుడు సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో ఆమె కొత్త రాజకీయ పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు పార్టీ నమోదు ప్రక్రియను కవిత ప్రారంభించారు. సాధారణంగా రాజకీయ పార్టీల నమోదు ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో సాగుతుంది. అయితే, తన దరఖాస్తుపై ఈసీఐ వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.జనవరి 23న ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పార్టీ నమోదు కోసం ఈసీఐకి దరఖాస్తు చేశారు కవిత. ఫిబ్రవరి 23న దరఖాస్తులో సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ ఈసీఐ తిరుగు టపా పంపింది. మార్చి 19న దిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్పై కీలక విచారణ జరగనుంది. ఈ న్యాయపోరాటం ద్వారా పార్టీని సాధ్యమైనంత త్వరగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.గతంలో ‘తెలంగాణ జాగృతి’ అనే సాంస్కృతిక సంస్థ ద్వారా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో కవిత విజయవంతమయ్యారు. ఇప్పుడు దాదాపు అదే పేరును రాజకీయ పార్టీగా మార్చడం వెనుక సెంటిమెంట్, బ్రాండ్ వాల్యూ రెండూ ఉన్నాయి. తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి ప్రాతిపదికన తన రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించుకోవాలనేది ఆమె ఆలోచనగా కనిపిస్తోంది.పార్టీ నమోదు విషయంలో ఈసీఐ లేవనెత్తిన లోపాలు ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారాయి. రాజకీయ పార్టీ నమోదుకు ఉండాల్సిన నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. నిధుల సమీకరణ, పార్టీ రాజ్యాంగం, సభ్యత్వ వివరాల్లో స్పష్టత ఉండాలి. హైకోర్టు ఈ విషయంలో ఈసీఐకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తుందనేది పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్ నీడలో కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ వేదిక ఉండాలని ఆమె ఆశిస్తున్నారు. మహిళా సాధికారత, తెలంగాణ హక్కులే ప్రధాన ఎజెండాగా ఈ పార్టీ పనిచేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటున్న లిక్కర్ స్కామ్ కేసుల నేపథ్యంలో, రాజకీయంగా యాక్టివ్గా ఉండటం ద్వారా ఆ ఆరోపణలను ఎదుర్కోవాలని ఆమె యోచిస్తున్నారు. జాగృతి సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ను నేరుగా రాజకీయ శక్తిగా మార్చడం ఈ పార్టీ ఉద్దేశ్యం‘తెలంగాణ ప్రజా జాగృతి’ ఆవిర్భావం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చు. యితే సాంకేతిక లోపాలను సవరించుకోకుండా.. కవిత కోర్టుకు వెళ్లడం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఆ సాంకేతిక లోపాలు పరిష్కరించలేనివి అయితే తప్ప ఇలా చేయరని.. భావిస్తున్నారు. కవిత ఇప్పుడు ఆ సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుంటే తప్ప.. రిజిస్ట్రేషన్ పూర్తి కాదు. ఎలాగోలా నెల రోజుల్లో పూర్తి చేసి తన పార్టీని ప్రకటించాలని కవిత ప్రయత్నిస్తున్నారు.కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్కు ఇది అనుబంధ శక్తిగా మారుతుందా లేదా కవిత స్వతంత్ర గళాన్ని వినిపిస్తారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి దిల్లీ హైకోర్టు ఇచ్చే తీర్పు ఈ కొత్త పార్టీ ప్రస్థానానికి పునాది కానుంది.



