తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగ శ్రవణ్ విమర్శ
జాబ్ క్యాలెండర్ కు అంత్యక్రియలు నిర్వహించి వినూత్న నిరసన
డిసెంబర్ 21న రాష్ట్ర నిరుద్యోగ దినోత్సవం నిర్వహించాలని పిలుపు
విజయవాడ: ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తన పాదయాత్రలో ప్రకటించిన సీఎం జగన్.. అనంతరం అధికారంలోకి వచ్చిన తరువాత యువతను మోసం చేశారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగ శ్రవణ్ కిలారు విమర్శించారు. గత నాలుగున్నర ఏళ్లలో ఒక్కసారి కూడా తన హామీ నిలబెట్టుకోకుండా యువత ఆశలను సమాధి చేసారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో విజయవాడ స్మశాన వాటికలో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి గత నాలుగున్నర ఏళ్లుగా నిరుద్యోగ యువతను మభ్యపెట్టారన్నారు. రాష్ట్రంలో గత ఏడాది దాదాపు 8వేల మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 364 మంది నిరుద్యోగులేనని తెలిపారు. అంటే సగటున రోజుకో నిరుద్యోగి ప్రభుత్వ తీరుతో ఆత్మహత్య చేసుకోవడం తనను కలచి వేసిందన్నారు.



