అధికార బదిలీకి గుర్తు పార్లమెంట్
సెంట్రల్ హాల్తో ఎమోషనల్ ముడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: నూతన పార్లమెంటుకు వెళ్లే ముందు ఈరోజు ఉభయ సభల సభ్యులు పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పార్లమెంటు భవనంతో పాటు, సెంట్రల్ హాల్కు సంబంధించిన విషయాలను గుర్తుచేసుకున్నారు. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ సెంట్రల్ హాల్ సాక్షిగా నిలిచిందని అన్నారు. బ్రిటన్ నుంచి భారత్కు అధికార బదిలీకి ఈ హాలే సాక్షమని పేర్కొన్నారు. మన రాజ్యాంగం ఇక్కడే రూపుదిద్దుకుందని అన్నారు. 1952 నుంచి ఇక్కడ దాదాపు 42 మంది దేశాధ్యక్షులు ప్రసంగించారని గుర్తుచేశారు. రాష్ట్రపతులు ఇక్కడ 86సార్లు తమ ప్రసంగాలను వినిపించారని తెలిపారు.సెంట్రల్ హాల్తో ఎమోషనల్గా ఎంతో ముడిపడి ఉన్నామని, అలాగే ఇది ఎంతో స్ఫూర్తినింపిన ప్రదేశమని అన్నారు. నూతన పార్లమెంటులోకి మారడానికి ఇదే సమయమని, ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. చిన్న కాన్వాస్పై పెద్ద బొమ్మ గీయలేమని, ఇప్పుడు పెద్ద కాన్వాస్పై చిత్రీకరించాల్సిన సమయం వచ్చిందని, భారత్కు పెద్ద విజన్ అవసరమని మోదీ వెల్లడించారు. భారత దేశం గ్లోబల్ సౌత్ వాయిస్గా ఎదుగుతోందని అన్నారు. ప్రపంచం మనలో విశ్వామిత్రుడిని చూస్తోందని తెలిపారు. ప్రజల ఆంకాక్షలు పెరుగుతున్నాయని, అందుకు తగినట్లుగా మనం ముందుకు సాగాలని మోదీ పేర్కొన్నారు.కొత్త పార్లమెంటు భవనంలోకి మారినంత మాత్రాన పాత భవనం గౌరవం ఏమాత్రం తగ్గకూడదని, ఈ భవనాన్ని సంవిధాన సభగా పిలవాలని మోదీ తెలిపారు. ఈ పార్లమెంటు భవనంలో ట్రిపుల్ తలాక్ను నిషేధించామని, దీని వల్ల ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ట్రాన్స్జెండర్స్కు, ప్రత్యేక అవసరాలున్న వారికి న్యాయం జరిగేలా మనమంతా కలిసి చట్టాలను ఆమోదించామని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసే అవకాశం మనకు దక్కిందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచే నాలుగు వేలకు పైగా చట్టాలను ఆమోదించుకున్నామని తెలిపారు. ఇలా ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ పార్లమెంటు సాక్షిగా నిలిచిందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న భారత్కు పరిష్కారంగా కొత్త భవనంలోకి అడుగులు వేద్దామని మోదీ పేర్కొన్నారు. ఈరోజు కొత్త సంసద్ భవన్ను కొత్త ఆశలతో వెళ్తున్నామని, ప్రజలకు మనపై చాలా అంచనాలు ఉన్నాయని, దీంతో మన బాధ్యత మరింద పెరుగుతోందని, అందుకు తగినట్లుగా మనం ఉండాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సెంట్రల్ హాల్లో మాట్లాడుతూ అన్నారు. పాత పార్లమెంటు భవనం వద్ద ఈరోజు ఫొటో సెషన్ జరిగింది. పార్లమెంటు సభ్యులు, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఫొటోలు దిగారు. చివరగా పాత పార్లమెంటులో ప్రధాని మోదీ ఎంపీలకు అభివాదం చేశారు. తర్వాత పాత భవనానికి వీడ్కోలు పలికి ప్రధాని మోదీని అనుసరిస్తూ ఎంపీలు అందరూ కొత్త పార్లమెంటు భవనంలోకి నడుచుకుంటూ వెళ్లారు. అందరూ వందే మాతరం, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో నూతన భవనంలోకి అడుగుపెట్టారు. దీంతో ప్రాంగణమంతా సందడిగా మారింది. కొత్త పార్లమెంటు భవనానికి పార్లమెంటు హౌస్ ఆఫ్ ఇండియా గా నామకరణం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది.

పాత సభను మనం గౌరవించుకోవాలి
దశాబ్ధాల చరిత్ర కలిగిన పార్లమెంట్ భవనం నేటితో రిటైర్ కాబోతోంది. ఎన్నో రాజకీయాలకు సాక్ష్యంగా మిగిలిన పాత పార్లమెంట్ భవనంలో ఇకపై అధ్యక్ష అనే మాటలు వినిపించవు. ఈ రోజు కొత్త పార్లమెంట్ భవనంలోకి సభ మారబోతోంది. ఈ రోజు ఉభయ సభల ఎంపీలు పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకాయి. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్ ని ఉద్దేశించి మాట్లాడారు.ఉభయ సభలు కొత్త పార్లమెంట్ భవనానికి మారిన తర్వాత పాత పార్లమెంట్ భవనం అని పిలుస్తూ దాని విలువ దిగజార్చవద్దని, పాత భవనానికి ‘సంవిధాన్ సదన్’ అని పేరు పెట్టాలని ప్రధాని మోదీ మంగళవారం సూచించారు. గత 75 ఏళ్లుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న భవనాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.సంవిధాన్ సదన్ అని పేర్కొనడం పార్లమెంట్ చరిత్ర సృష్టించిన నాయకులకు నివాళులు అర్పించినట్లు అవుతుందని ప్రధాని అన్నారు. భవిష్యత్ తరాలకు ఈ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరాన్ని మనం వదులుకోకూడదని అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కొత్త భవనానికి మారే ముందు జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు.
కొత్త సభలోకి గ్రాండ్ ఎంట్రీ
వందేళ్ల నాటి కట్టడం, భారతదేశ భవిష్యత్తు, అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి చిరునామా నిలిచిన పార్లమెంట్, నేడు కొత్త భవనంలోకి తరలివెళ్తోంది. ఎన్నోచర్చలు, భావోద్వేగాలు, ఉగ్రవాద దాడికి కూడా ఈ బ్రిటీష్ హయాంలోని కట్టడం సాక్ష్యంగా నిలిచింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మోడీ సర్కార్ కొత్త పార్లమెంట్ని నిర్మించింది. తాజాగా ఈ రోజు నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి సభ మారనుంది. ఇప్పటి నుంచి కొత్త పార్లమెంట్ దేశ భవిష్యత్తుకు కొత్త చిరునామా కానుంది.సభ కొత్త పార్లమెంట్ భవనానికి మారుతున్న ఈ సమయంలో ఎంపీలంతా పాత పార్లమెంట్ భవనానికి ఘనంగా వీడ్కోలు చెప్పారు. మంగళవారం లోక్సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్స్లో గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమానికి పీఎం మోడీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, ఉపరాష్ట్రపతి-రాజ్యసభ చైర్మన్ జగ్దీఫ్ ధంఖర్తో పాటు ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి, సోనియా గాంధీ, శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
సేవ చేయడానికి నిజమైన స్థానం
కొత్త భవనంలోకి వెళ్లిన వెంటనే జాతీయ గీతం ఆలపించారు. తర్వాత సభ్యులందరూ వారి వారి సీట్లలో కూర్చున్నారు. అనంతరం పార్లమెంటు కార్యకలాపాలను ప్రారంభించారు. తొలుత స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. కొత్త పార్లమెంటు భవనంలో లోక్సభ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్య చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఆయన పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మకమైన రోజును చూస్తున్నందుకు మనమంతా అదృష్టవంతులమని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.స్పీకర్ మాట్లాడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంటులో తొలి ప్రసంగం చేశారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ నూతన భవనంలోకి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆజాదీ అమృత కాలంలో ఇది ఉషోదయం లాంటిదని అన్నారు. భారతదేశ నూతన భవిష్యత్తుకు నిదర్శనమని తెలిపారు. వినాయకచవితి రోజున కొత్త భవనం ప్రారంభించడం శుభ సూచకమని పేర్కొన్నారు.అన్ని పార్టీలు గత వైరాన్ని మర్చిపోవాలని మోదీ ఎంపీలకు విజ్ఙప్తి చేశారు. కొత్త భవనంలోకి కొత్త సంకల్పం తీసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అందరం నిరంతరం కృషి చేయాలని మోదీ పేర్కొన్నారు.చంద్రయాన్ 3 విజయవంతమవడం దేశంలోని ప్రజలందరినీ గర్వపడేలా చేసిందని అన్నారు. జీ20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించడం, విజయవంతంగా సదస్సును నిర్వహించడం పట్ల భారత్కు ఎంతో గౌరవం దక్కిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ దేశ ప్రభావం పెరిగిందని, గొప్ప విజయాలు భారత్ సాధించగలదని నిరూపించామని పేర్కొన్నారు. ఆధునిక భారతీయతత్వం, ప్రాచీన ప్రజాస్వామ్యాల కలబోతకు చిహ్నంగా ఈరోజు కొత్త పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని అన్నారు.’దేశానికి సేవ చేయడానికి పార్లమెంటు అత్యున్నత ప్రదేశం. ఈ కొత్త భవనంలో మనం ఏం చేసినా దేశంలోని పౌరులందరికీ అది స్ఫూర్తివంతంగా ఉండాలి. మనం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు గత చేదు అనుభవాల్ని మర్చిపోవాలి. ఈ భవనం కొత్తది. ఇక్కడ ప్రతీదీ కొత్తది. కానీ ఇక్కడ మన వారసత్వపు చిహ్నం ఉంది. అదే నిన్నటిని, నేటిని కలుపుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కొత్త ప్రారంభానికి మొదటి సాక్షి, భావి తరాలకు స్ఫూర్తినిచ్చే పవిత్రమైన సెంగోల్ ఇది. భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ తాకి సెంగోల్ ఇది.’ అని మోదీ మాట్లాడారు.



