
హైదరాబాద్ : తెలంగాణ జైళ్లశాఖలో ఇద్దరు ఐజీలకు మధ్య పని విభజన జరిగింది. సాధారణ పరిపాలన వ్యవహారాలను రాజేశ్కు అప్పగించగా.. సంక్షేమం బాధ్యతను మురళీబాబు పర్యవేక్షించనున్నారు. ఈ పని విభజన రెండేళ్ల పాటు అమల్లో ఉండనుంది. అనంతరం ఇద్దరి బాధ్యతలను పరస్పరం బదిలీ చేయాలని నిర్ణయించారు. జైళ్లశాఖలో ఐజీ హోదాలో ఇలా పని విభజన జరగడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ఇప్పటివరకు జైళ్ల శాఖలో ఒకే ఐజీ పోస్టు ఉండేది. ఇటీవలే రెండో పోస్టును సృష్టించారు. ఈక్రమంలోనే గతంలో డీఐజీగా ఉన్న మురళీబాబుకు ఇటీవలే ఐజీగా పదోన్నతి కల్పించారు. తాజాగా ఇద్దరు ఐజీలకు వేర్వేరు బాధ్యతల్ని అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జైళ్లశాఖ ఉన్నతాధికారుల పరంగా ఇదే పెద్ద పోస్టు కావడం విశేషం. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ వ్యవహరిస్తారు. డీజీపీ లేదా అదనపు డీజీపీ స్థాయి ఉన్నతాధికారి ఈ బాధ్యతల్ని పర్యవేక్షిస్తారు. జైళ్లశాఖకు ఎంపికైన అధికారులకు సంబంధించినంత వరకు మాత్రం ఐజీదే ఉన్నత హోదా. ఈనేపథ్యంలో తొలిసారిగా ఇద్దరు ఐజీలు వేర్వేరు బాధ్యతల్లో జైళ్లశాఖను పర్యవేక్షించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలోకి ఖైదీల ప్రవేశాలు, అధికారుల బదిలీలు.. తదితర వ్యవహారాలను రాజేశ్ చూడనున్నారు. ఖైదీల సంక్షేమం, పరిశ్రమల ఉత్పత్తులు, పెట్రోల్బంక్ల్లో విక్రయాలు, అధికారుల శిక్షణ.. తదితర వ్యవహారాలను మురళీబాబు పర్యవేక్షించనున్నారు.



