ఈసారి ఈవీఎంలపై అభ్యర్థి ఫొటో

- Advertisement -

గతంలో పార్టీ గుర్తు, పేరు మాత్రమే ఉండేవి

అఫిడవిట్‌లో ఖాళీలుంటే తిరస్కరణ

31 వరకు ఓటు హక్కు దరఖాస్తులు

చిరునామా మార్పు అర్జీలను నిలిపేశాం

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

హైదరాబాద్‌: ‘ఓటర్ల సౌలభ్యం కోసం ఈవీఎంలలో కేంద్ర ఎన్నికల సంఘం స్వల్ప మార్పు చేసింది. ఈవీఎంపై గతంలో పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు మాత్రమే ఉండేవి. రానున్న ఎన్నికల్లో పార్టీ వీటితోపాటు అభ్యర్థి ఫొటో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘పోస్టల్‌ బ్యాలెట్‌పైనా అభ్యర్థుల ఫొటోలు ఉంటాయి. ఈ నెల 31 వరకు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా మార్పునకు చేసే దరఖాస్తులను సోమవారం నుంచే ఆపేశాం. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ పథకాలకు నిబంధనలు గతంలో ఎలా ఉన్నాయో అలానే అమలవుతాయి. నూతన పథకాలను ప్రకటించాలంటే ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉన్న రాజకీయ నాయకుల ఫొటోలను తక్షణం తొలగించాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు(లౌడ్‌ స్పీకర్లు) నిలిపివేయాలి.

This time candidate's photo on EVMs
This time candidate’s photo on EVMs

ఓటర్లకు వివిధ సౌకర్యాలు

అన్ని పోలింగు కేంద్రాల్లో బ్రెయిలీ లిపిలో డమ్మీ బ్యాలెట్‌ పత్రాలు అందుబాటులో ఉంచుతాం. దివ్యాంగులు, వృద్ధులకు సహాయకంగా వాలంటీర్లను, చక్రాల కుర్చీలను ఉంచుతాం. ర్యాంప్‌లనూ ఏర్పాటు చేస్తాం. దివ్యాంగులకు రవాణా సదుపాయమూ కల్పిస్తున్నాం. వీరు ముందుగా యాప్‌లో పేరు నమోదు చేసుకోవాలి. అన్ని పోలింగు కేంద్రాల్లో సహాయ కేంద్రం ఉంటుంది. సమస్యాత్మక పోలింగు కేంద్రాల గుర్తింపు ప్రక్రియ సాగుతోంది. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు 1950 నంబరు  అందుబాటులో ఉంటుంది.

అఫిడవిట్‌లో అన్ని వివరాలు నింపాల్సిందే

అభ్యర్థులు నామినేషన్ల దాఖలు సందర్భంగా ఇచ్చే అఫిడవిట్లలో ఏవైనా ఖాళీలు ఉంటే ఎన్నికల అధికారులు నోటీసు జారీ చేస్తారు. వాటికి నిర్దిష్ట వ్యవధిలోగా సవరణ అఫిడవిట్‌ ఇవ్వకుంటే నామినేషన్‌పత్రాలను తిరస్కరిస్తాం. మద్యం దుకాణాలు నిబంధనలు అతిక్రమిస్తే తక్షణం వాటిని మూసివేస్తాం.

నగదు తరలింపునకు ముందస్తు అనుమతి

నిర్ధారిత పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తీసుకెళుతూ పట్టుపడితే ఆ మొత్తాన్ని సీజ్‌ చేస్తాం. ధ్రువపత్రాలుంటే వాటిని సరిచూసి అధికారులు విడుదల చేస్తారు. అందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ అవసరాలకు డబ్బును తీసుకెళ్లాలని నిర్ణయించిన పక్షంలో ముందస్తుగా అనుమతి తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఆన్‌లైన్‌ ద్వారా ఆయా వివరాలను అధికారులు చెక్‌ చేస్తారు’ అని వికాస్‌రాజ్‌ వివరించారు. సమావేశంలో అదనపు డీజీ సంజయ్‌కుమార్‌జైన్‌, అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్‌, సంయుక్త అదనపు ముఖ్య ఎన్నికల అధికారి సత్యవాణి పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌ అమలుపై కచ్చితంగా వ్యవహరించాలని వికాస్‌రాజ్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో స్పష్టంచేశారు.

This time candidate's photo on EVMs
This time candidate’s photo on EVMs
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular