సెల్వ వినాయకర్ ఆలయానికి యాంత్రిక ఏనుగును బహుకరించిన త్రిష
Trisha presents mechanical elephant to Selva Vinayakar temple
ప్రముఖ సినీ నటి త్రిష అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి గజ అనే యాంత్రిక ఏనుగును బహూకరించారు. దీనిని సంప్రదాయ మంగళవాద్యాలతో ఆలయానికి అందజేసినట్లు పీఎఫ్సీఐ నిర్వాహకులు తెలిపారు. ఆలయ వేడుకల కోసం ఒక యాంత్రిక ఏనుగును బహూకరించడం తమిళనాడులో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి త్రిష ఈ పనిచేశారు.ఈ యాంత్రిక ఏనుగును గురువారం జరిపిన ప్రత్యేక కార్యక్రమంలో సంప్రదాయ మంగళవాద్యాల మధ్య ప్రజలకు పరిచయం చేశారు. దాదాపు 3 మీటర్ల పొడవు, 800 కిలోల బరువుతో, రియలిస్టిక్ డిజైన్లో రూపొందిన ఈ ఏనుగు- చక్రాలపై నడుస్తూ, భక్తులపై నీరు చల్లడం, తల, చెవులు, దంతాలు కదలించడం లాంటివి చేస్తుంది.మానవీయకోణంలోనే ఈ బహుమతి: రూ.6 లక్షలతో తయారైన ఈ ఏనుగును ఆలయ వేడుకల సమయంలో ఉపయోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అడవి ఏనుగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, వాటికి హాని కలగకుండా మానవీయ మార్గంగా ఈ ప్రయత్నం చేపట్టినట్టు పీఎఫ్సీఐ వెల్లడించింది.భక్తులకు వినూత్న అనుభూతి: ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మతివానన్, నగర ఇన్స్పెక్టర్ బాలమురుగన్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పూల వర్షంతో యాంత్రిక ఏనుగును స్వాగతించారు. అనంతరం దీపారాధన, భరతనాట్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ యాంత్రిక ఏనుగు వల్ల భక్తులకు వినూత్న అనుభూతి కలుగుతుందని, ఇది ఆలయానికి ఆకర్షణగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.



