- Advertisement -
టీయూడబ్ల్యూజే డిమాండ్లు న్యాయ సమ్మతమే
-నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకే కష్టాలు
-నాగర్ కర్నూల్ సభలో మంత్రి జూపల్లి
TUWJ demands are legitimate - Minister Jupally in Nagar Kurnool Sabha
జర్నలిస్టుల గొంతుకగా, వారి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) చేస్తున్న డిమాండ్లు న్యాయ సమ్మతంగా ఉన్నాయని, జర్నలిజం వృత్తిలో నిజాయితీగా తమ కర్తవ్యాన్ని నిర్వర్థిస్తున్న జర్నలిస్టుల ఆర్థిక కష్టాలు తనకు తెలుసునని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
మంగళవారం నాడు నాగర్ కర్నూల్ లోని రూబీ గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇండ్లు, ఆరోగ్య పథకం లాంటి సంక్షేమ చర్యల కోసం టీయూడబ్ల్యూజే కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ కృషికి రాష్ట్ర మంత్రిగా తన సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే జర్నలిజం ముసుగులో అడ్డదారులు పడుతూ, వృత్తికి చెడ్డ పేరు తెస్తున్న వారి పట్ల యూనియన్ కఠినంగా వ్యవహారించాలని మంత్రి జూపల్లి కోరారు. వృత్తి ధర్మాన్ని నీతి, నిజాయితీతో నిర్వహిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం మంత్రిగానే కాకుండా వ్యక్తిగతంగా ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సభకు గౌరవ అతిథిగా హాజరైన టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ మాట్లాడుతూ, ఓవైపు జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడుతూనే, మరోవైపు వృత్తిలో నైతిక విలువల పరిరక్షణ కోసం తమ సంఘం కృషి చేస్తుందన్నారు. సమాజ హితం, ప్రజల మేలు కోసం కలాలకు పదునెక్కించే వారు మాత్రమే తమ సంఘం దృష్టిలో జర్నలిస్టులని విరాహత్ అలీ స్పష్టం చేశారు. ఇంకా ఈ సభలో నాగర్ కర్నూల్, కల్వకుర్తి శాసన సభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కే. రాంనారాయణలతో పాటు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





- Advertisement -


