స్వల్ప తేడాతో విజయం.. ఇది శాశ్వతం కాదు
ఈ ఫలితాన్ని తిరగరాస్తాం..ఎంపి ధర్మపురి అరవింద్
నిజామాబాద్ ఫిబ్రవరి 16
Victory by a narrow margin.. This is not permanent
We will rewrite this result..MP Dharmapuri Arvind
నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి త్వరలోనే ఈ ఫలితాన్ని తిరగరాస్తాం:.. ఎంపి ధర్మపురి అరవింద్ ధ్వజం నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వేదికగా కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. బిజెపిని దెబ్బతీసేందుకు సిద్ధాంతాలను పక్కనబెట్టి ఈ మూడు పార్టీలు అనైతిక పొత్తు పెట్టుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం నగర మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీ తీరును, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ కారు రేసు వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారని అరవింద్ ప్రశ్నించారు. ఒకవైపు విమర్శలు చేస్తూనే, మరోవైపు బిఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ వాహనాల్లో ఎక్కించుకుని తీసుకురావడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన అడిగారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు ఎందుకు మద్దతు ఇచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ ఎన్నిక ప్రక్రియలో కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారని ఎంపి ఆరోపించారు. “కొందరు పోలీసులు రాజకీయ రంగు పూసుకుని మరీ పనిచేశారనీ విమర్శించారు. బిఆర్ఎస్ అభ్యర్థిని కాంగ్రెస్ వ్యానులో కూర్చోబెట్టి తీసుకురావడంలో పోలీసుల హస్తం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శించారు.
స్వల్ప తేడాతో విజయం.. ఇది శాశ్వతం కాదు
బిజెపి అభ్యర్థి స్రవంతి రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి కేవలం మూడు స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారనీ పేర్కొన్నారు. అలాగే ఎంఐఎం అభ్యర్థి, బిజెపి అభ్యర్థి బంటు రాముపై గెలవడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఉందని విమర్శించారు. ఈ ఎన్నిక ఫలితం ముగిసిపోయిన అధ్యాయం కాదు. ఈ బాడీ గడువు ముగియక ముందే, ఈ ఫలితాన్ని రివర్స్ చేసి చూపిస్తాం, ప్రజాక్షేత్రంలో అక్రమ పొత్తులను ఎండగడతాం” అని అరవింద్ హెచ్చరించారు. గెలిచిన మేయర్, డిప్యూటీ మేయర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.



