రీ ఎంట్రీకి విజయసాయిరెడ్డి…
నెల్లూరు, ఏప్రిల్ 7, (వాయిస్ టుడే)
Vijayasai Reddy Set for a Re-entry…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రాజధాని ప్రతిపాదన విషయంలో జగన్ చుట్టూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు ఆ పార్టీకి టిడిపి, జనసేన బలమైన ప్రత్యర్థులుగా ఉన్నారు. కానీ ఆ జాబితాలో ఇప్పుడు చాలా పార్టీలు వచ్చి చేరుతున్నాయి. చివరకు ఇప్పటివరకు స్నేహంగా వ్యవహరించిన గులాబీ పార్టీ సైతం రూటు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. అమరావతి రాజధాని విషయంలో పక్కన ఉన్న తెలంగాణలో సైతం జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రతికూలత వస్తోంది. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు పై చర్చ జరిగిన సమయంలో కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి మాటలు చూస్తే మాత్రం జగన్ పై వ్యతిరేకత ఎలా ఉందో అర్థమవుతుంది. మరోవైపు అది చాలదన్నట్టు జగన్మోహన్ రెడ్డి మావిగన్ రాజధాని ప్రతిపాదనను సొంత పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ఎప్పుడు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసేవారు సైతం దిక్కుమాలిన సలహా అంటూ విరుచుకుపడుతున్నారు. మావిగన్ ప్రతిపాదన అనేది జగన్మోహన్ రెడ్డి సొంత నిర్ణయం అని సజ్జల లాంటి వారు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు.అయితే ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఫైనల్ అన్నట్టు ఉండేది. జగన్ పై ఈగ వాలితే అంతా పడిపోయేవారు. కానీ అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చించే క్రమంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నాయి వివిధ పార్టీలు. కానీ కనీసం కౌంటర్ ఇవ్వలేకపోయారు ఆ పార్టీ నేతలు. నిండు రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి పై కాంగ్రెస్ ఎంపీలు విరుచుకుపడితే ఏం చేస్తున్నట్టు అని ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎంపి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇదేనా మీ సమర్థత అంటూ ప్రశ్నించడం ప్రారంభించారు. ఇక్కడ విజయసాయిరెడ్డి రెండు రకాల లక్ష్యాలను నెరవేర్చుకున్నారు. ఒకటి తనలాంటి వాడు జగన్ వెంట లేకపోవడం లోటు అని సంకేతాలు పంపాడు. కేంద్ర రాజకీయాల్లో వైసీపీకి అత్యవసరంగా ఒక నేత అవసరం అని గుర్తు చేశారు.మరోవైపు కూటమికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. అమరావతి రాజధాని కి చట్టబద్ధత కల్పించడం ఎంత ముఖ్యమో.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయడం అంతే ముఖ్యం అని హెచ్చరిస్తూ స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. కొత్త రాజధాని ప్రతిపాదన కంటే రైతుల సమస్యలపై వైసీపీ పోరాడితే బాగుంటుందని సూచనలు ఇచ్చారు. అయితే ఇప్పటికీ తాను కూటమికి వ్యతిరేకమని.. అవసరం అనుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమని సంకేతాలు పంపగలరు. ఏడాది కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన ఆయన తరువాతే ఎందుకో రాజకీయాలు మాట్లాడుతూ వచ్చారు. రాజకీయాలు చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. బిజెపిలోకి వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ కూటమి నుంచి అభ్యంతరాలు రావడంతో ఆయన డిఫెన్స్ లో పడిపోయారు. అందుకే జగన్ ఒప్పుకుంటే తిరిగి వైసీపీలో చేరుతానని సంకేతాలు పంపుతున్నారు. కానీ జగన్ అందుకు ఒప్పుకుంటారో? లేదో? చూడాలి.



