విశాఖపట్నం: దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో విశాఖపట్టణం ఒకటని, అన్ని రకాల వనరులూ కేంద్రీకృతమై ఉన్న ఈ నగరానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రటరీ అనా రాయ్ పేర్కొన్నారు. సమ్మిళిత ఆర్థిక విధానాలు, మిషన్ మోడ్ ప్రాజెక్టుల అమలు ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణం ఉమ్మడి జిల్లాలో ఉన్న అభివృద్ధి అవకాశాలు, సువిశాలమైన సముద్ర తీరం, పర్యాటక ప్రాజెక్టులపై జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ఆమె స్పందిస్తూ పలు సూచనలు చేశారు. బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజంపై మరింత దృష్టి సారించాలని సూచించారు. విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించేలా, వారు ఇక్కడ ఎక్కువ రోజులు బస చేసేలా వినూత్న రీతిలో పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని చెప్పారు.నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ ప్రాంతీయ సమావేశం స్థానిక వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రటరీ అనా రాయ్, రాష్ట్ర ప్రణాళికా విభాగం సెక్రటరీ గిరిజా శంకర్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. విశాఖపట్టణం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు, జీవీఎంసీ కమిషనర్, సీతంపేట ఐటీడీఏ పీవో ప్రత్యక్షంగా పాల్గొనగా శ్రీకాకుళం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు వర్చ్యువల్ విధానంలో పాల్గొన్నారు. ఆయా జిల్లాల్లో ఉన్న అభివృద్ధి అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు.



