మహబూబ్నగర్ కార్పొరేషన్లో పోలింగ్ కేంద్రాల సందర్శన
– భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష
Visit to polling stations in Mahabubnagar Corporation
– SP reviews security arrangements
మహబూబ్ నగర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి, మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీ బ్రిలియంట్ స్కూల్, ఠాగూర్ స్కూల్, గాంధీ రోడ్ స్కూల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, సిబ్బంది విధులు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, క్యూలైన్ నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అక్కడి అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేశారు.
జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని తెలిపారు. సీఐలు, డీఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు విధులు నిర్వర్తిస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. అదనంగా రూట్ మొబైల్ బృందాలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ శాంతి భద్రతలను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నాయని వివరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యే వరకు పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.


