ప్రధాని మోదీని కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై విజయసాయిరెడ్డి ప్రధాని మోదీతో చర్చించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరైన విజయసాయిరెడ్డి, పార్లమెంట్ లోని ప్రధాని మోదీ కార్యాలయానికి వెళ్లి ఆయన్ను కలిశారు.
పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించానని.. ఎప్పటిలాగే, ప్రధానమంత్రిని కలవడం ఒక గౌరవం.. విశేషం అంటూ విజయసాయి అభిప్రాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫలవంతమైన సహకారం కోసం ఎదురు చూస్తున్నామంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో షేర్ చేశారు. ఈ భేటీలో ప్రత్యేక హోదా, ఆర్థిక సహకారం, కేంద్రప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరికొన్ని నెలల్లో ఏపీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధానితో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
అంతకుముందు విజయసాయి రెడ్డి రాజమండ్రి విమనాశ్రయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంపై ప్రధాని మోదీకి ధన్యవాదములు తెలుపుతూ ట్వీట్ చేశారు. రాజమండ్రి విమానాశ్రయంలో రూ.350 కోట్లతో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ భవనం.. గోదావరి ప్రాంతానికి ఒక వరం.. ప్రస్తుతం ఉన్న భవనం కంటే 400 రెట్లు ఎక్కువ.. 10 రెట్ల ప్రయాణికులకు మేలు జరగుతుంది. సంవత్సరానికి 30 లక్షల వరకు ప్రయాణీకులు ప్రయాణం చేయగలరు.. ఇది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. అంటూ.. విజయసాయి రెడ్డి నరేంద్రమోదీ, సింధియాకు ధన్యవాదములు తెలిపారు.



