హైదరాబాద్, సెప్టెంబర్ 16, 2025: పౌర సదుపాయాల మెరుగుపరచడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం లక్డికాపూల్ నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు రూ.17.93 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించనున్న వరద నీటిని తరలించే కాలువలకు (storm water drains) నాంపల్లి లో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ , మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి నగరంలో రోడ్లు, నాళాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వరద నీటి కాలువల పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్,నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ,ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫండీ , జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.
స్టార్మ్ వాటర్ డ్రైన్ ప్రాజెక్ట్ – వివరాలు
వర్షాకాలంలో వరదలు మరియు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, జిహెచ్ఎంసి లక్డీకపూల్ నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కీలక ప్రాంతాల్లో వర్షపు నీటి కాలువ (SWD) నిర్మాణ ప్రాజెక్టును చేపట్టింది. ఈ RCC బాక్స్ డ్రైన్ మొత్తం 2,720 మీటర్ల పొడవున నిర్మించబడుతుంది. FTCCI మార్గ్, రెడ్ హిల్స్, దేవయ్య బాగ్, ఏక్ మినార్ మసీదు రోడ్, నేతాజీ నగర్ మరియు నాంపల్లి స్టేషన్ రోడ్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీటిని సమర్థవంతంగా పారుదల చేయడం లక్ష్యంగా ఉంది.
ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు:
– న్యూ ప్రగతి ప్రెస్ నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం (2,150 మీటర్లు)
– చిరాగ్ అలీ లేన్ నుండి బాంబే బజార్ వరకు, నాంపల్లి స్టేషన్ రోడ్ ద్వారా RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం (570 మీటర్లు)
ఈ ప్రాజెక్ట్ పరిధిలోని మొత్తం క్యాచ్మెంట్ ఏరియా 175.13 హెక్టార్లు.



