బీసీ రిజర్వేషన్లను 42% పెంచే వరకు పోరాడుతూనే ఉంటం :రాజ్యసభ సభ్యులు వద్దిరాజు
We will continue to fight until BC reservations are increased by 42%: Rajya Sabha member Vaddiraju

బీసీ రిజర్వేషన్స్ కు పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఆర్డినెన్స్,జీవోల వల్ల రిజర్వేషన్స్ పెంపుదల సాధ్యపడదని, పార్లమెంటులో చట్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ నందు పొందుపర్చాకే అమలు సాధ్యమని తమ పార్టీ మొదటి నుంచి చెబుతున్నదన్నారు.బీసీ జేఏసీ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు బంద్ కు సంపూర్ణ మద్దతుగా శనివారం ఉదయం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్,వీ.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్,కోరుకంటి చందర్ తదితర నాయకులతో కలిసి రిజర్వేషన్స్ పెంపుదల విషయంలో పాలకుల వైఖరిని ఎండగట్టారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బంద్ కు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా,దొంగే, దొంగా దొంగా అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉద్యోగ,రంగాలలో 42 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి చూపకుండా…ఎన్ని మాటలు చెప్పినా, డ్రామాలు ఆడినా,పొర్లు దండాలు పెట్టినా కాంగ్రెస్ పాలకులను సబ్బండ వర్గాలు నమ్మరు కాక నమ్మరని స్పష్టం చేశారు.మంత్రివర్గంలో మున్నూరుకాపు,యాదవ,కుర్మ, ముస్లిం,లంబాడీలకు చోటివ్వకుండా అణచివేస్తుండడం,కులగణన సందర్భంగా జనాభాను 25లక్షల పైగా తక్కువ చేసి చూపడం పట్ల సబ్బండ వర్గాలు పాలకులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు “ఓట్ చోర్” పేరుతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విలువైన సమయాన్ని వృధా చేసిందని, రిజర్వేషన్స్ పెంపుదల గురించి కనీసం కూడా ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.అదేవిధంగా జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాకు కాంగ్రెస్ అగ్ర నాయకులు హాజరు కాలేదని గుర్తు చేస్తూ రిజర్వేషన్స్ పెంచడంలో ఆ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనడానికిదే ప్రబల నిదర్శనమని వ్యాఖ్యానించారు.ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ అధికార బీజేపీపై,ప్రధాని నరేంద్రమోడీపై వత్తిడి పెంచి పార్లమెంటులో బిల్లు పెడితే రిజర్వేషన్ల పెంపునకు చట్టబద్ధత లభిస్తుందని ఎంపీ రవిచంద్ర వివరించారు.రాష్ట్రపతి,ప్రధాని వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లితే రావడానికి, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే సంపూర్ణ మద్దతు తెలపడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.రిజర్వేషన్స్ పెంపుదలకు చట్టబద్ధత లభించే వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని ప్రయత్నిస్తే సబ్బండ వర్గాల కోపానికి,ఆగ్రహ జ్వాలలకు కాంగ్రెస్ బలికాక తప్పదని ఎంపీ వద్దిరాజు హెచ్చరించారు.


