బీఆర్ఎస్ ను తిట్టి తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏం చేస్తోంది?
ఎస్ఎల్ బీసీ, నక్కలగండి, డిండి ప్రాజెక్ట్ లు ఎప్పుడు పూర్తి చేస్తారు?
సుంకిశాల ప్రమాదంపై కాంట్రాక్ట్ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేఘాతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులది ఫెవికాల్ బంధం ఏంటీ?
ఎమ్మెల్సీ కవిత
నల్గోండ
What is Congress doing after coming to power by insulting BRS?: MLC Kavitha
కృష్ణానది నీళ్లు తేవటంలో అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తాం. వెంకట్ రెడ్డి అన్న నాతో ఏం పంచాయితీ ఉంది? మా పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేయించావని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. బుధవారం కవిత మీడియాతో మాట్లాడారు. జాగృతితో పెట్టుకున్నోళ్లు ఎవరు బాగుపడలేదు. ఇప్పుడు రాజకీయాలు చేయటానికి రాలేదు. రాజకీయాలు చేసినప్పుడు మీకు గట్టి పోటీదారులను పెడతాం. ముందు ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ల దుఖాన్ని చూడండని అన్నారు.
కవిత మాట్లాడుతూ నల్గొండ జిల్లా అంటేనే ఎంతో చరిత్ర కలిగిన జిల్లా. రాజ్యాలు, ప్రజా ఉద్యమాలు, విప్లవాత్మక ఆలోచనలు కలిగిన ప్రాంతం. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఒకప్పుడు బౌద్ధం, జైనం తో పాటు అద్భుతమైన ఆలోచన సరళి కలిగిన జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో మా ఇక్కడి చరిత్రను గుంటూరుకు తీసుకెళ్లారు. ఉద్యమం సమయంలో దీనిపై మేము పోరాటం చేశాం. నాగార్జున కొండ వద్ద ఉన్న స్థూపాన్ని కూడా గుంటూరు కు తీసుకెళ్లారు. పానగళ్లు లో ఉన్న ఎన్నో విగ్రహాలను అక్కడకు తీసుకెళ్లారు. తెలంగాణ వచ్చాక కూడా అవన్నీ రిటర్న్ రాలే. జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్ర కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది. మేము ఇక్కడి చరిత్ర తెలుసుకునే క్రమంలో 60 వేల ఏళ్ల చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని తెలిసిందని అన్నారు.
పచ్చల, ఛాయ సోమేశ్వరం ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకో పక్క సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. సాయుధ రైతాంగ పోరాటం చేయని ఇళ్లు ఇక్కడ లేదు. ఆనాటి ఉద్యమ కారులు మల్లు స్వరాజ్యం గారిని ఇటీవలే మనం కోల్పోయాం. కానీ ఇప్పటికీ కూడా జిల్లాలో అదే చైతన్యం ఉంది. ఆలోచనపరులు, చైతన్య వంతులు కలిగిన జిల్లా ఇది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు తిరిగాను. హుజుర్ నగర్ లో సిమెంట్ ఫ్యాక్టరీలలో కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమాలు చేశాం. ప్రతి మండల కేంద్రంలో బతుకమ్మ ఎత్తుకొని నేను తిరిగాను. అలాంటి ఈ జిల్లాకు ఇప్పుడు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా వచ్చాను. నేను ఇక్కడకు ఎందుకు వచ్చానో ఈ జిల్లా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. నీళ్లు, నిధులు, నియామాకాలు అనే నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నాం. గత పదేళ్లలో చాలా విజయాలు సాధించాం. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. తెలంగాణ వచ్చాక మన నీళ్లు మనకు వస్తాయని అందరం అనుకున్నాం. కానీ నల్గొండ జిల్లాకు కృష్ణా నీళ్లు పూర్తి స్థాయిలో వచ్చాయో లేదో అందరం ఆలోచించాలని అన్నారు.
మాధవ రెడ్డి ప్రాజెక్ట్, కృష్ణా, మూసీ, దిండి, ఎస్ఎల్ బీసీ ప్రాజెక్ట్ లతో జిల్లాకు నీళ్లు రావాలి. అదే విధంగా ఎస్సారెస్సీ తో కొంత కాళేశ్వరం, దేవాదుల ద్వారా కొంత నీళ్లు రావాలి. కానీ జిల్లాకు నీళ్లు అంటే కృష్ణానది మీదనే ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి. మరి బీఆర్ఎస్ పదేళ్లు, కాంగ్రెస్ రెండేళ్లు పన్నెండేళ్లలో కృష్ణానది నీళ్లు తెచ్చుకున్నామా ఆలోచన పరులు ఆలోచించాలి. నాగార్జున సాగర్ డ్యామ్ ఇక్కడే కనబడుతుంది. కానీ చుట్టు ఉన్న ఐదు మండలాలకు నీళ్లు రావు. నెల్లికల్లు ప్రాజెక్ట్ పూర్తైతే 5 మండలాలకు నీళ్లు వస్తాయి. కానీ ఇప్పటి వరకు ఎవరు పూర్తి చేయలేదు. బీఆర్ఎస్ ను ఇదే అంశంలో విమర్శించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఎందుకు పనులు చేయటం లేదు. బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా సరే సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. అందుకే ప్రభుత్వాన్ని అడిగే వాళ్లు ఉండాలి. వారిపై ఒత్తిడి పెట్టినప్పుడే పనులు అవుతాయి. ఇక్కడి సుంకిశాలను హైదరాబాద్ నీటి అవసరాలకు సెకండ్ అల్టర్ నేట్ అని గతంలో కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయిన పరిస్థితి వుందని అన్నారు.
కనీసం ఆ విషయాన్నిబయటకు కూడా చెప్పలేదు. ఎంప్లాయిస్ తీసిన వీడియో ద్వారా ఆ విషయం బయటకు తెలిసింది. దీంతో ఆగమేఘాల మీద అధికారులను తీసేశారు. ఎంక్వైరీ వేశామన్నారు. విచారణ కమిటీ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని సూచించింది. కానీ కాంట్రాక్టర్ ను ఏమీ చేయలే. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఒక్క మాట అనలే. ఇక మేఘాతో సీఎం ఫెవికల్ బంధం తెలిసింది. ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఇలాగే ఎన్ని ఏళ్లు పనులు చేసుకుంటూ పోతారు. కిష్టరాయినిపల్లె, నెల్లికల్ ప్రాంతాల్లో భూసేకరణ చేసిన 17 ఏళ్లు అవుతోంది. భూమి ఇచ్చిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వారి కుటుంబంలో వారికి ఉద్యోగం ఇస్తామని ఇవ్వలేదు. నిర్వాసితులకు భూమి లేదు, ఉద్యోగం లేని పరిస్థితి. బంగారు తెలంగాణ అంటే మారాల్సింది పేదల జీవన పరిస్థితులు. కృష్ణా నది నీళ్లు తేవటంలో సీఎం ఇలాగే అలసత్వం వహిస్తే…నిర్వాసితులతో కలిసి ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తామని అన్నారు.
నిర్వాసితుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా లేనంత దయనీయంగా ఉంది వాళ్ల పరిస్థితి. నిన్న దేవరకొండలో వెల్ఫేర్ స్కూల్ కు వెళ్లాం. బీఆర్ఎస్ హయాంలోనే ఆ స్కూల్ కు 5 ఎకరాలు కేటాయిస్తే రెండు ఎకరాలు కబ్జా అయ్యింది. పడుకునే చోటనే పిల్లలు చదువుకునే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ను ఇవే అంశాలపై తిట్టి తిట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ స్కూల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ ను పట్టించుకోవటం లేదు. కలెక్టర్లు వారానికి ఒకసారి సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో నిద్ర చేయాలని సీఎం చెప్పారు. ఎక్కడైనా కలెక్టర్లు ఆ మాటను పట్టించుకున్నారా? సీఎం మాట అంటే కలెక్టర్లకు లెక్క లేదు. ఉదయం మేము మెటర్నటీ హాస్పిటల్ కు వెళ్లాం. ఒక్కో బెడ్ మీద ఇద్దరు పేషెంట్లను, పిల్లలను పడుకోబెట్టారు. డాక్టర్లు, నర్సుల ఓపికకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. సౌకర్యాలు లేకపోయినా వారు పనిచేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం. హాస్పిటల్ డెవలప్ మెంట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. రోజు వారీ అవసరాలకు ఇక్కడి హాస్పిటల్ లక్షా 20 వేల ఖర్చు ఉంటుంది. హాస్పిటల్ డెవలప్ మెంట్ అథారిటీ వద్ద డబ్బులు లేవు. సూపరిండెంట్ వద్ద పెట్టి క్యాష్ లేదు. ప్రతిదానికి పైకి లేఖ రాస్తూ డబ్బులు రావాలంటే జరగాల్సి న డ్యామేజ్ అప్పటికే జరిగిపోతుంది. పిడియాట్రిక్ లో విభాగంలో ఓ బిడ్డ పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు.
ఎంఆర్ఐ లేకపోవటంతో డాక్టర్లు కూడా ఆచేతన స్థితిలో ఉండిపోయారు. నీలోఫర్ హాస్పిటల్ కు వెళ్లాల్సిన పరిస్థితి. తల్లితండ్రుల వద్ద రూపాయి లేదు. మా జాగృతి తరఫున వారిని నీలోఫర్ కు పంపించే ఏర్పాటు చేశాం. కానీ ఎంతమందికి ఈ పరిస్థితి. ప్రభుత్వపరంగా సిస్టమ్ ఛేంజ్ కావాలి. ఇవి రాజకీయాలు ఎంత మాత్రం కావు. లాస్ట్ ఇయర్ లో రాజకీయాలు చేద్దామని అన్నారు.
ప్రభుత్వ హాస్పిటల్ లో ఎపిడ్యూరెల్ లేని పరిస్థితి. బిడ్డలను కన్న వారికి నొప్పి లేకుండా ఈ మందు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ మందు లేకపోవటంతో ఇంకా ఆటవిక కాలం మాదిరిగా మహిళలు ప్రసవ వేదన పడుతున్నారు. వారు బిడ్డలను కనేటప్పుడు పడే వేదన మరో జన్మ ఎత్తినట్లుగా ఉంటుంది. ఈ విషయంలో నేను మహిళలకు క్షమాపణ చెబుతున్నా. గత ప్రభుత్వం లో ఉన్నప్పుడు నాకు కూడా ఎపిడ్యూరెల్ హాస్పిటల్ లో ఉంచాలన్న ఆలోచన రాలేదు. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా జెంటిల్ మెన్. మిడియా ద్వారా ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నా. కచ్చితంగా హాస్పిటల్ లో ఎపిడ్యూరెల్ ఉంచాలని కోరుతున్నా. మీ ద్వారానైనా ఒక మంచి మార్పు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇవ్వాళ మేము హాస్పిటల్ కు పోతాం అనగానే జిల్లా మంత్రి కూడా హాస్పిటల్ విజిట్ కార్యక్రమం పెట్టుకున్నారంట. మేము వెళ్లే వరకు కూడా ఆయన హాస్పిటల్ విజిట్ చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదో? ఆయన వెళ్లిన తర్వాతనైనా హాస్పిటల్ లో ఏమైనా మార్పులు వస్తాయో చూడాలి. మా పిల్లలు నా ప్రొగ్రామ్స్ కోసం కొన్ని ఫ్లెక్సీలు పెడితే అరెస్ట్ చేయించారంట. వెంకట్ రెడ్డి అన్న నాతో నీకు ఏమీ పంచాయితీ ఉందన్నా? పోలీసులకు చెప్పి మా పిల్లలను వదిలేయమనండని అన్నారు.ఇప్పుడు మేము రాజకీయాలు చేయాలని రాలేదు. రాజకీయాలు చేసే సమయంలో కచ్చితంగా చేస్తాం. ఈ జిల్లాలో మీకు గట్టి పోటీదారులను పెడతాం. మా జాగృతి కార్యకర్తలతో పెట్టుకోవద్దని అన్నారు.


