సేనతో నేను..
గుంటూరు, జూలై 18, ( వాయిస్ టుడే)
With the army, I…
జనసేన పార్టీ స్థానిక ఎన్నికల కోసం సమాయత్తమవుతుంది. సెప్టంబరులో స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నాయి. దీంతో జనసేన అప్రమత్తమయింది. కార్యకర్తల్లో ఉన్న నిరాశ, నిస్పృహలను తొలగించడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చర్చా వేదిక కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ కోసం పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్న నినాదంతో కార్యకర్తల్లో తిరిగి ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ ఈ కార్యక్రమం డిజైన్ చేసిందని చెప్పాలి. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు ఎదురవుతున్న సవాళ్లపై పార్టీ దృష్టి పెట్టిందని అనుకోవాలి. నియోజకవర్గాల వారీగా చర్చా వేదికను ఏర్పాటు చేసి కార్యకర్తల మనసులో మాటను విని వారి సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో ఈ బాధ్యతను మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకున్నారు. జనసేన లో ఏ గ్రూపులు ఉండవని, పవన్ కల్యాణ్ గ్రూపు ఒక్కటే ఉంటుందని కార్యకర్తలకు చెబుతున్నారు. ఈ వేదిక ద్వారా నాయకులు, కారకర్తల సమన్వయం కుదర్చడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. జనసేన పార్టీకి క్రియాశీలక సభ్యత్వం 24 లక్షల మార్క్ కు చేరుకుంది. నియోజకవర్గాల్లో జనసైనికులు ఎదుర్కొంటున్న సమస్యలు విని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వనున్నారు. . స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ బూత్ లెవెల్ లో నిలబడి పార్టీకి ఓటు వేయించాలంటే కార్యకర్త ఉత్సాహంగా ఉండాలి. ఆ ఉత్సాహం నింపేందుకే ఈ కార్యక్రమం అనుకోవాలి. పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ముందు నుంచే కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయాలంటే వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి నాయకత్వం దగ్గరగా ఉందని భరోసా ఇవ్వగలిగితే చాలా వరకూ ప్రయోజనం ఉంటుంది. అందుకే చర్చా వేదిక ద్వారా కార్యకర్తలకు పార్టీని మరింత దగ్గరకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. జనసనకు బలం ఉన్న ప్రతి చోటా పోటీ చేస్తామని చెబుతూ కొంత ధైర్యాన్ని ఇస్తున్నారు. మొత్తం మీద క్యాడర్ ను తిరిగి అక్కున చేర్చుకునే ప్రయత్నంలో జనసేన ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.




