వ్యాపార విస్తరణ, లాభార్జనపై మహిళలకు అవగాహన కల్పించాలి…
Women should be made aware of business expansion and profitability...జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
సంక్రాంతి కంటే ముందు మహిళలకు వ్యాపార నైపుణ్యంపై 2 రోజులు వర్క్ షాప్ నిర్వహించాలి
మహిళా మార్ట్, మహిళ శక్తి అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం
వ్యాపార విస్తరణ, లాభార్జనపై మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా మార్ట్, ఇందిరా మహిళ శక్తి అమలుపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాలతో సమన్వయం చేసుకుంటూ స్వశక్తి మహిళా సంఘాలు తయారు చేసే సామాగ్రిలను అమ్మేందుకు మహిళా మార్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని, స్వశక్తి మహిళా సంఘాలు తయారు చేసే ప్రొడక్ట్ ప్యాకింగ్, వాటికి బ్రాండింగ్ కల్పించడంపై దృష్టి సారించాలని అన్నారు.
మహిళా మార్ట్ లో విక్రయించే సామాగ్రి నాణ్యతతో ఉండాలని కలెక్టర్ తెలిపారు. వివిధ స్వశక్తి సంఘాల మహిళలు తయారు చేసే వస్తువులు విక్రయించే విధంగా మహిళా మార్ట్ తయారు చేయాలని అన్నారు. ఖమ్మం జిల్లా బ్రాండింగ్ వచ్చేలా లోగో, స్టిక్కరింగ్ డిజైన్ తయారు చేయాలని, మహిళా మార్ట్ ప్రత్యేకంగా తెలిసే విధంగా భవనానికి పెయింటింగ్స్ వేయించాలని అన్నారు.
ఇందిరా మహిళా శక్తి క్రింద మండలాల్లో వ్యాపారాలు నిర్వహించే మహిళా సంఘాలకు వ్యాపార విస్తరణ, లాభార్జనపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సంక్రాంతి కంటే ముందు మన జిల్లా కలెక్టరేట్ లో నూతనంగా యూనిట్లు ఏర్పాటు చేసిన 300 మహిళలకు అకౌంటింగ్ , వ్యాపార నైపుణ్యాలపై రెండు రోజుల పాటు అవగాహన కల్పించాలని అన్నారు.
మహిళా శక్తి యూనిట్ లో గ్రౌండింగ్ తో పాటు అవి విజయవంతంగా నడిచేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందించాల్సిన బాధ్యత మనపై ఉంటుందని, దీని కోసం మహిళలకు వ్యాపార దృక్పథం, అధికంగా లాభాలు ఎక్కడి నుంచి రాబట్టాలనే ఆలోచనా సరళి వచ్చే విధంగా వర్క్ షాప్ వంటివి ఏర్పాటు చేయాలని అన్నారు.
వ్యాపారాలు చేసే సమయంలో ఎటువంటి అనుమతులు తీసుకోవాలి, పన్నులు ఎలా చెల్లించాలి మొదలు అంశాలు కూడా మహిళలకు వివరించాలని అన్నారు. తక్కువ రిస్క్ తో వ్యాపారాలు ఎలా చేయాలి వంటి అంశాలు మహిళలకు తెలియజేయాలని అన్నారు.
మండలాల్లో బాగా నడవని యూనిట్లను గుర్తించి వాటిని బాగు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలపై ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. గ్రామ స్వభావం ఏంటి, ఎటువంటి సామాగ్రి కొంటారు వంటివి ఆలోచించి వ్యాపారం చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, ఇంచార్జ్ ఎస్సీ కార్పొరేషన్ ఇడి నవీన్ బాబు, అడిషనల్ డి.ఆర్.డి.ఓ. నూరుద్దీన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు




