Sunday, September 8, 2024

టిడిపిలో చేరేందుకు వైసిపి ఎమ్మెల్సీల మొగ్గు.

- Advertisement -

టిడిపిలో చేరేందుకు వైసిపి ఎమ్మెల్సీల మొగ్గు.
విజయవాడ, జూలై 13

YCP MLCs inclined to join TDP.

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజారిటీతో కొనసాగుతోంది. శాసనసభలో ఏ బిల్లు అయినా సులభంగా పాస్ చేసుకునే బలం కూటమికి ఉంది. గత ఐదేళ్లు అధికారాన్ని అనుభవించిన వైసీపీ దారుణ పరాభవంతో 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే, వైసీపీకి శాసనమండలిలో మాత్రం బలం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా కీలక బిల్లులను పాస్ చేయించుకోవాలంటే శాసన మండలిలో కూడా ఆమోదం తప్పనిసరి. ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలిలో వైసీపీకి బలం ఉండడంతో అధికార కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బంది తప్పదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలు శాసనమండలలోనూ బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న పలువురు ఎమ్మెల్సీలపై టిడిపి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లు అధికారం ఉన్నప్పటికీ తమను కనీసం పట్టించుకోలేదన్న భావన చాలా మంది ఎమ్మెల్సీలలో ఉంది. అటువంటి వారంతా ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వారిపైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి చేర్చుకునేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా ఉన్నప్పటికీ కనీసం గౌరవం, గుర్తింపు దక్కకపోవడం పట్ల అవమాన భారంతో ఉన్న పలువురు ఎమ్మెల్సీలు ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సంసిద్ధులవుతున్నారు. ఈ క్రమంలోనే తమకు సన్నిహితంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా టిడిపిలో చేరేందుకు రాయబారాలను పంపుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులను కలిసి తమ ఆలోచనలను వారికి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు, మంత్రులను కలిసి మాట్లాడినట్లు చెబుతున్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం బుధవారం రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఉద్ధరించామన్నట్టుగా చూశారని ఓ ఎమ్మెల్సీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అధికారంలో ఉన్నంతకాలం జగన్ తమతో ఒక్కసారి కూడా ప్రత్యేకంగా కూర్చుని మాట్లాడిన దాఖలాలు లేవని అసంతృప్త ఎమ్మెల్సీలు ప్రస్తావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత మాత్రమే జగన్ తమతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇప్పుడు కూడా తమ అవసరం వచ్చింది కాబట్టి పిలిచారని, అది కూడా తమ గురించి కాకుండా మండలిలో తన కోసం నిలబడాలని చెప్పినట్లు పలువురు ఎమ్మెల్సీలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్సీలు తమకు తెలిసిన మంత్రుల ద్వారా టిడిపిలో చేరేందుకు రాయబారాలు నెరపుతున్నారు. ఇదే ఆలోచనలో మరింత మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు చెబుతున్నారు. కొంతమంది టిడిపి మంత్రుల ద్వారా పార్టీలో చేరేందుకు అవకాశం కల్పించాలంటూ కోరుతున్నారు. మరి కొంతమంది వచ్చి కలుస్తామంటూ మంత్రులకు వర్తమానాన్ని పంపిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ మద్దతుతో గెలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో కూడా ఇద్దరూ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గడిచిన ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించిన, ఇబ్బందులకు గురి చేసిన వారి విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అటువంటి నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు కూడా ఆసక్తి చూపించడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీలో ఎమ్మెల్సీలుగా ఎన్నికై ఎన్నికల సమయంలో ఆయా స్థానాలకు రాజీనామా చేసి పలువురు టిడిపిలో చేరారు. వీటిలో రెండు స్థానాలకు కొద్ది రోజుల కిందట అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, వైసీపీ నుంచి అభ్యర్థులెవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో టిడిపి నుంచి సి రామచంద్రయ్య, జనసేన నుంచి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్