అంబటి కుటుంబానికి అండగా వైసీపీ ఉంటుంది
కేసులను చట్ట ప్రకారం ఎదుర్కొంటాం
గుంటూరు, ఫిబ్రవరి 4
YCP will stand by Ambati’s family: YS Jagan
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు గుంటూరులో పర్యటించారు. ఇటీవల దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు జగన్. మాజీ మంత్రి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. కేసులను చట్టప్రకారం కోర్టుల్లో ఎదుర్కొంటామని వారికి మద్దతు తెలపనున్నారు.మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత నడుమ, భారీ కాన్వాయ్తో తాడేపల్లి నుంచి గుంటూరుకు చేరుకున్నారు. జగన్ కాన్వాయ్ తో పాటు మరో 9 వాహనాలు వెళ్లాయి. ఈ పర్యటన సందర్భంగా గుంటూరు నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.గత శనివారం అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఇది ఏపీలో అరాచక పాలనకు నిదర్శనమని విమర్శించారు. అంబటి రాంబాబు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఆయన కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికి జగన్ వెళ్లారు. పరామర్శ అనంతరం, అంబటి ఇంటి సమీపంలో ధ్వంసమైన వైసీపీ కార్యాలయాన్ని కూడా జగన్ పరిశీలించి, పార్టీ నేతలతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరు నగరంలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. తాడేపల్లి నుంచి మంగళగిరి, కాకాని మీదుగా సాగిన ఆయన పర్యటన ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఆయనకు 2 వారాల రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. అంబటి కుటుంబానికి మద్దతు తెలిపి, వారికి అండగా నిలిచేందుకు జగన్ గుంటూరుకు వచ్చారు. ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడి ఘటనలో గుంటూరు పట్టాభిపురం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవిని ఏ1గా, ఆమె భర్త రామచంద్రరావును ఏ2గా ఎఫ్ఐఆర్లో చేర్చారు. మొత్తం 31 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై అల్లర్లు సృష్టించడం మరియు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ పాప ప్రక్షాళన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేసింది. ఈ క్రమంలో గుంటూరులో జరిగిన ఆందోళనలో పాల్గొన్న అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. 24 గంటల్లోగా చంద్రబాబుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రులతో పాటు టీడీపీ నేతలు అంబటిని హెచ్చరించినా పట్టించుకోలేదు. తాను అలాంటి మాటలు అనకుండా ఉండాల్సింది అన్నారు, కానీ చంద్రబాబుకు క్షమాపణ చెప్పకపోవడంతో టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు అంబటి నివాసానికి వెళ్లి హంగామా చేశారు. ఇంటిపై దాడికి యత్నించారు, ఓ చోట నిప్పు సైతం పెట్టడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు.


