Friday, April 3, 2026

అమరావతిలో లెక్క తప్పిన వైసీపీ

- Advertisement -

అమరావతిలో లెక్క తప్పిన వైసీపీ
విజయవాడ, ఏప్రిల్ 2, (వాయిస్ టుడే)

YCP’s Calculations Go Awry in Amaravati
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై వారం రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. దీనిపై కూటమి పార్టీలు చాలా దూకుడుగా రాజకీయంగా ఎత్తులు వేస్తూ గేమ్‌లో పైచేయి సాధించాయి. కానీ ఈ విషయంలో వైసీపీ మాత్రం మరోసారి సెల్ఫ్‌గోల్స్‌తో మరోసారి అబాసుపాలైంది. అమరావతి అనే ఎమోషన్‌ను క్యారీ చేయడంలో కూటమి పార్టీలు ముఖ్యంగా టీడీపీ విజయవంతం అయిందని చెప్పవచ్చు. ఈ విషయంలో విధానం అంటూ లేకుండా వైసీపీ తీవ్రంగా విమర్శలు పాలైంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో చర్చకు వచ్చే సందర్భంలో కూడా తన వాదనను బలంగా చెప్పలేకపోయింది. అన్ని పార్టీలు ముక్తకంఠంతో అమరావతికి జై కొడితే ఒక్క వైసీపీ మాత్రమే తన స్టాండ్ ఏంటో చెప్పలేక చతికిలపడింది.   అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న టైంలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ మాట్లాడుతూ, టీడీపీ లీడర్లంతా గ్యాలరీల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి నారా లోకేష్‌తోపాటు లోక్‌సభ ఎంపీలంతా కూడా అక్కడ కూర్చొని చర్చ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇది చూడటానికి సాధారణ విషయమే కావచ్చు కానీ, ప్రియాంక చతుర్వేదీ మాట్లాడుతూ అమరావతిపై వారికి ఉన్న ఎమోషన్ ఎలాంటిదో అంటూ కితాబు ఇచ్చారు. దీని అక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొడుతూ స్వాగతించారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత అందరూ లేచి సభకు నమస్కరించారు. హర్షధ్వానాలు చేశారు. అక్కడి వారంతా జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అమరావతి అనే ఎమోషన్‌ను పార్లమెంట్‌లో క్యారీ చేయడంలో కూటమి పార్టీలు, ముఖ్యంగా టీడీపీ విజయవంతం అయ్యింది. అందుకే అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఎన్డీఏ, ఇండి కూటమి పార్టీలు అన్నీ జై అమరావతి అని నినదించాయి. ఇంతటి కీలకమైన ఘట్టంలో వైసీపీ పాత్ర లేకుండా పోయింది. దీనికి ఆ పార్టీ కన్ఫ్యూజన్ స్టాండే కారణం. సందర్భానుసారం స్టాండ్ మారుస్తూ అటు పార్టీ క్యాడర్‌ను, ఇటు ప్రజలను డైలమాలో పడేసింది. అసలు అమరావతిని వ్యతిరేకిస్తున్నారో చెప్పలేదు. సమర్థిన్నారో చెప్పడం లేదు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎత్తున్న మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ సరికొత్త పల్లవి అందుకుంది. రోజుల వ్యవధిలోనే రకరకాల రంగులు మార్చి అటు సభల్లో ఇటు ప్రజల్లో చులకనైంది. తెలంగాణ ఏర్పాటుకు టీడీపీ వ్యతిరేకమా అనుకూలమా అంటే పార్టీ అధిష్ఠానం నాడు ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. 2009లో తెలంగాణకు జై కొట్టిన తర్వాత మళ్లీ ప్లేట్ మార్చింది. ఇక్కడ ఆంధ్రప్రాంతంలో జై సమైక్యాంధ్ర నినాదం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కోవాలని కోరడం, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇలా భిన్నమైన స్టాండ్‌తో జనాలను కన్ఫ్యూజ్ చేసింది. అదే తర్వాత తెలంగాణ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి ఒక కారణం అయ్యింది. అయితే చివరకు క్లైమాక్స్‌లో మాత్రం తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చి తెలంగాణకు జై కొట్టినా ప్రయోజనం లేకపోయింది. ఆ పార్టీపై ప్రజలకు అనుమానం అలానే ఉండిపోయింది. ఇప్పుడు వైసీపీ అదే స్థితిలో ఉంది. 2019కు ముందు అమరావతికి జగన్‌తోపాటు పార్టీ నేతలంతా జై కొట్టారు. అధికారంలోకి వస్తే టీడీపీ చేసిన దానికంటే ఎక్కువ చేస్తామనీ హామీలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించింది. మూడు రాజధానులు అంటూ సరికొత్త మ్యూజిక్ స్టార్ట్ చేసింది. అంతే రాజధాని ప్రాంత రైతులంతా రోడ్లపైకి వచ్చారు. అధికారంలో ఉన్న వైసీపీ నాడు వారికి పోటీగా మూడు రాజధానులు కావాలనే వాదనలో అమరావతిలోనే ప్రత్యేక ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేసింది. కనీసం అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలేంటీ, మూడు రాజధానుల విధానం ఎందుకు ఎంచుకున్నామో అనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేయలేదు. ఉక్కుపాదం మోపి ఉద్యాన్ని అణచివేయాలని చూశారు. వారిపై తీవ్రమైన విమర్శలు చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఇలా చేసి వారిపై సానుభూతి వచ్చేలా చేశారు. అప్పటి వరకు రాజధాని రైతులు గురించి పెద్దగా పెట్టించుకోని వారంతా కూడా తెలుసుకోవడం మొదలు పెట్టారు. డబ్బులు తీసుకోకుండా ప్రభుత్వంపై నమ్మకం భూములు ఇచ్చిన రైతుల పట్ల ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తుందా అనేలా వైసీపీ చేసింది. దీంతో అప్పటి వరకు లేని ఒక ఎమోషన్ కనెక్షన్ వారితో ఏర్పడింది. వీటికి తోడు వైసీపీ ఎత్తుకున్న మూడు రాజధానులను ముందుకు తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైజాగ్‌లో రుషి కొండను బద్దలు కొట్టి కట్టుకున్న ప్యాలెస్‌ కూడా నెగెటివ్ భావన వచ్చింది. 2024 ఎన్నికల్లో మూడు రాజధానులను ప్రజలు తిరస్కరించారనే విషయాన్ని కూడా వైసీపీ అంగీకరించడం లేదు. అలాగనే మూడు రాజధానులకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నామని చెప్పడానికి కూడా ముందుకు రావడం లేదు. ఎన్నికల వరకు మూడు రాజధానులు అంటూ ప్రచారం చేసిన ఆ పార్టీ తర్వాత సైలెంట్ అయిపోయింది. అమరావతిలో అభివృద్ధి జరగడం లేదని సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టింది. ఇప్పుడు తేల్చుకోవాల్సిన వచ్చిన సందర్భంలో కూడా అసెంబ్లీకి వెళ్లకుండా, పార్లమెంట్‌లో వాదన గట్టిగా వినిపించకుండా తేలిపోయింది.అమరావతికి అనుకూలంగా ఉన్నామంటూనే బిల్లును వ్యతిరేకిస్తున్నామని అటూఇటూ కాని స్టేట్మెంట్‌తో అబాసుపాలైంది. లోక్‌సభలో, రాజ్యసభలో రెండింటిలో అన్ని పార్టీలు అమరావతి వర్థిల్లాలంటూ దీవిస్తుంటే వైసీపీ మాత్రం శాపనార్థాలు పెట్టి బయటకు వచ్చేసింది. అన్నింటికి తోడు జగన్ చేసిన మావిగన్‌ కూడా తీవ్ర విమర్శలకు ట్రోలింగ్‌కు గురైంది. చంద్రబాబు విమర్శించినట్టు అమరావతి అనడం కూడా జగన్‌కు ఇష్టం లేదని అందుకే పూటకో నినాదం చేస్తున్నారని అన్నట్టుగానే వారి తీరు ఉంది. ఇలా అడుగడుగునా తప్పుల మీద తప్పులు చేస్తూ అమరావతి ప్రాంతానికే కాకుండా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు వైసీపీ దూరంగా జరిగిపోయింది. అందుకు భిన్నంగా టీడీపీ. అమరావతి రాగం ఎత్తుకున్నప్పటి నుంచి వారి పార్టీ లీడర్లంతా ఒకటే మాటపై ఉన్నారు. జగన్ మూడు రాజధానుల ఎత్తుగడను కూడా లెక్క చేయకుండా అన్ని ప్రాంతాల్లో ఒకే నినాదం ఉండేలా చూసుకున్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో రాజధానికి పైస ఆశించకుండా రైతులు భూములు ఇచ్చిన విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. తాత్కాలికంగా అని చెప్పి కొన్ని బిల్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. దీనికి తోడు టీడీపీ నేతలు ఎవరూ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రయత్నించ లేదు. విజిటింగ్ లీడర్స్ అంటూ విమర్శలు ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడ్డారు. అక్కడ వైజాగ్‌లో జగన్ తన కోసం ప్యాలెస్ రెడీ చేసుకోవడం, ఇక్కడ చంద్రబాబు తనకంటూ ఇంటిని నిర్మించుకోకపోవడం కూడా కలిసి వచ్చింది. సంక్షోభంలోనే అవకాశాలు వెతుక్కునే చంద్రబాబు అమరావతి రైతుల ఉద్యమం, నాటి ప్రభుత్వం వారిని చిత్రవధ చేసిన పరిణామాలను తనకు రాజధానికి అనుకూలంగా ప్రజలను ఏకం చేయడానికి చేసుకున్నారు.అమరావతి రైతులను టీడీపీ వదిలేస్తుందని ప్రచారం చేసిన వైసీపీ అక్కడి రైతులను పట్టించుకోకుండా తప్పుల మీద తప్పులు చేసింది. రైతులను పట్టించుకోదని విమర్సలు ఎదుర్కొన్న టీడీపీ మాత్రం వారిని నమ్ముకొని, ఉద్యమాలు చేసి సెంటిమెంట్‌ను రాజేసి రాష్ట్ర ప్రజలందరితో జై అమరావతి అనేలా చేసింది. రాష్ట్ర ప్రజలతోనే యావత్ దేశ ప్రజలతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే అని నినదించేలా చేసింది. అమరావతి నినాదాన్ని పట్టుకొని టీడీపీ వంద మెట్లు పైకి ఎగబాగితే, పూటకో నినాదంతో వైసీపీ మరింత కిందికి జారిపోయింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్