
శ్రీధర్ బాబుదేనా విజయం?
నల్లేరుపై నడకలా కాంగ్రెస్
బీఆర్ఎస్ నుంచి నారాయణరెడ్డికి టికెట్
బీజేపీ నుండి పోటీ.చంద్ర పట్ల సునీల్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నాడు
మంథని: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాధాన్యం సంతరించుకున్న నియోజకవర్గం.. పి.వి. నరసింహరావు, శ్రీపాదరావు వంటి ప్రముఖులు ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం.. మంథని. రాష్ట్ర పునర్విభజనకు ముందు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎక్కువ సార్లు కాంగ్రెస్కే విజయం లభించిన ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయనే విషయంపై విశ్లేషణ..
శ్రీధర్ బాబుకే ఛాన్స్

ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పార్టీ కాంగ్రెస్. మొదటి నుంచి ఆధిపత్యం సాగిస్తున్న పార్టీ కూడా. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఒకసారి టీడీపీ, ఒకసారి టీఆర్ఎస్, ఒకసారి సోషలిస్ట్ పార్టీ సభ్యులు గెలవగా.. మిగతా 12 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రెండు సార్లు 2009లో, 2018లో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గెలుపొందారు. 2014లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు విజయం సాధించారు. అయితే.. ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను విశ్లేషిస్తే.. సిటింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోంది. అంతేకాకుండా.. ప్రత్యర్థి పార్టీలతో పోల్చితే ప్రజల్లో మన్ననలు కూడా శ్రీధర్బాబుకే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్.. పుట్ట మధుకు మొండి చేయి

అధికార బీఆర్ఎస్లో టికెట్ రేసులో ఉన్న వ్యక్తిగా మాజీ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ పుట్ట మధు పేరు వినిపిస్తున్నా.. అయనకు టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం సానుకలంగా లేదని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో సంచలనంగా మారిన లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం, ఇతర అవినీతి ఆరోపణలతో అధిష్టానం ఆయనను దూరం పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తనకు టికెట్ రాకపోతే.. బీజేపీ లేదా బీఎస్పీలోకి చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. ఆయన సొంత ఎజెండాను అమలు చేసుకుంటూ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ను వీడీ బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్తో సైతం ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని పార్టీ కేడర్ ఆరోపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో పుట్ట మధుకు టికెట్ కష్టం అనే మాట రూఢీగా వినిపిస్తోంది.

రంగంలోకి చల్లా
పుట్ట మధుకు టికెట్ కష్టమనే అభిప్రాయాల నేపథ్యంలో… కాటారం సింగిల్ విండో చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి అకస్మాత్తుగా టికెట్ రేసులోకి వచ్చారు. దీని వెనుక అధిష్టానం ప్లాన్ కూడా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈయన కూడా తనకు అధిష్టానం నుంచి టికెట్ భరోసా ఉందని కింది శ్రేణి నాయకులతో చెప్పుకుంటూ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీలోని ఉద్యమకారులతో మమేకం అవుతూ వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. దీంతో.. పార్టీకి నియోజకవర్గంలో పుట్ట మధుకు సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో.. చల్లా నారాయణరెడ్డికే టికెట్ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ.. అభ్యర్థులు కరవు
మరోవైపు.. బీజేపీ పార్టీని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ పార్టీకి నియోజకవర్గంలో సరైన అభ్యర్థి దొరకడం లేదనే అంశం విస్మయం కలిగిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన సనత్ కుమార్.. ఆ తర్వాత నియోజకవర్గంలో కనిపించిన దాఖలాలు లేవని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో.. బీజేపీ నుంచి చంద్రుపట్ల సునీల్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఆయన యవత ఆదరణ పొందేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా.. ఆయన సీఎం కేసీఆర్పైనా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. నియోజకవర్గంలో బీజేపీ బలంగా లేకపోవడంతో వ్యక్తిగత ఇమేజ్తో ఆయన గెలవడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సమస్యలపై గళంలో దుద్దిళ్ల ముందు
ఇక.. నియోజకవర్గంలో సమస్యలపై గళం వినిపించడంలో సిటింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత దుద్దిళ్ల ముందున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో కాళేశ్వరం ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం కోసం ఆయన నిరంతరం ప్రభుత్వంపై పోరు సాగిస్తున్నారని.. అదే విధంగా సింగరేణి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కూడా పోరు సాగిస్తన్నారనే సదభిప్రాయం ప్రజల్లో నెలకొంది. దీంతో.. ఆయనే ఈ సారి గెలుస్తారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆ రెండు వర్గాలు కీలకంగా
ఇక.. నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో పద్మశాలి, మున్నూరు కాపు సామాజిక వర్గ ఓటర్లే కీలకంగా నిలవనున్నారని తెలుస్తోంది. మొత్తం ఓటర్లలో దాదాపు యాభై శాతం మేరకు ఈ వర్గాల ఓట్లే ఉండడంతో వీరిదే ఎన్నికల్లో కీలక పాత్ర కానుందని తెలుస్తోంది. అయితే నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే అని ఈ నేపథ్యంలో యువ ఓటర్లు కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను నిర్దేశించే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే.. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకే అధికారం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీలో విభేదాలు, నాయకులపై అసంతృప్తి, అవినీతి ఆరోపణలతో బీఆర్ఎస్ గెలవడం కష్టమనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ పోటీలో ఉన్నా లేనట్లే అని.. ఆ పార్టీ నేతలు ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది.
మంథని నియోజకవర్గం ముఖ్యాంశాలు:
మొత్తం ఓటర్లు: 2,19,120
అత్యధికంగా గ్రామీణ ఓటర్లు
మున్నూరు కాపు, పద్మశాలి వర్గాలు కీలకంగా
ఇప్పట వరకు నాలుగు సార్లు గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యతిరేకత



