యువత సివిల్ ర్యాంకర్లను ఆదర్శంగా తీసుకోవాలి.
– రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇవి వేణుగోపాల్
——————
యువత సివిల్ సర్వీసెస్ ర్యాంకర్లను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇవి వేణుగోపాల్ పిలుపునిచ్చారు. సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకొని కరీంనగర్ మంకమ్మతోటలోని తన నివాసంలో ఆదివారం సివిల్ ర్యాంకర్లకు ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు హాజరైన నందాల సాయికిరణ్ (27వ), కొలనుపాక సహనల (729వ ర్యాంక్) ను ఆయన అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఇవి వేణుగోపాల్ గారు ర్యాంకులు సాధించేందుకు దోహదపడ్డ అంశాలపై ఇష్టాగోష్టిగా వారితో చర్చించారు. రాజ్యాంగానికి లోబడి ఉద్యోగ వృత్తిని కొనసాగిస్తూనే సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని సూచించారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నేటి యువత సన్మార్గంలో పయనిస్తూ తమ జీవిత లక్ష్యాలను చేరుకొని కీర్తి, ప్రతిష్టలను పొందాలని అన్నారు. గొప్ప వ్యక్తులను, సివిల్ ర్యాంకర్లను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గల్లీ నుండి సివిల్ ర్యాంక్ లు సాధించి, ఎదగాలని ఆకాంక్షించారు. పుట్టిన గడ్డ గర్వపడేలా మరో పది మందికి ఆదర్శంగా నిలుస్తూ పేరు, ప్రతిష్టలు సంపాదించాలని తెలిపారు. ర్యాంకర్ల లక్ష్య సాధన అంశాలపై, వాళ్ళ కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పేద కుటుంబాల నుండి వచ్చిన వారైనప్పటికీ మొక్కవోని దీక్షతో వీరు ర్యాంకులు సాధించడం అభినందనీయమని కొనియాడారు.
పేద, మధ్య తరగతి కుటుంబాల వారు కూడా నిరాశ చెందకుండా ఉన్నత విద్యాభ్యాసం చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా డి యల్ ఎస్ ఎ సెక్రటరీ వెంకటేష్, 14వ డివిజన్ కార్పొరేటర్ దిండిగాల మహేష్, న్యాయవాదులు ఉప్పల అంజనీప్రసాద్, ఏ.వి రమణ, ఏ. కిరణ్ కుమార్ , పెంచాల లక్ష్మణరావు, కొత్త ప్రకాశ్,ర్యాంకర్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.