సీఎం చంద్రబాబును కలిసిన ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్
14-year-old Siddharth creates CircadiaV app that diagnoses heart disease with the help of AIఏఐ సాయంతో గుండె జబ్బులు నిర్ధారించే సిర్కాడియావీ యాప్ను రూపొందించిన 14 ఏళ్ల సిద్ధార్థ్
సచివాలయానికి ఆహ్వానించి అభినందించిన సీఎం
అమరావతి, మార్చి 17 :
సీఎం చంద్రబాబును ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల అనే బాలుడు కలిశాడు. ఏడు సెకెన్లలోనే గుండె జబ్బులు నిర్ధారించేందుకు ఏఐ సాయంతో సిర్కాడియావీ యాప్ను సిద్ధార్థ్ ఇటీవల రూపొందించారు. స్మార్ట్ఫోన్ ద్వారా గుంటూరు జీజీహెచ్లో రోగులకు పరీక్షలు కూడా నిర్వహించారు. విషయం తెలుసుకున్న సీఎం సిద్ధార్థ్ను కలిసేందుకు ఆహ్వానించారు. సిద్ధార్థ్ ప్రొఫైల్ తెలుసుకుని అభినందించారు. దాదాపు అరగంట పాటు అతనితో సీఎం ముచ్చటించారు. వైద్యం రంగంలో సేవలందించేలా ఆవిష్కరణలు చేయాలని ప్రపంచ వ్యాప్తంగా తెలుగుజాతి ఎక్కడున్నా అద్భుతాలు సృష్టించాలని తాను ఎప్పుడూ కలలు కంటుంటానని, వాటిని సిద్ధార్థ్లాంటి విద్యార్థులు సాధించిన విజయాలు తనకు ఎంతో సంతృప్తినిస్తాయని అన్నారు. ఏఐలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సిద్ధార్థ్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. అనంతపురానికి చెందిన వీరి కుటుంబం 2010లో అమెరికాలో స్థిరపడింది. సీఎంను కలిసిన వారిలో సిద్ధార్థ్ తండ్రి మహేష్, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు.




