ఓటర్ల మదిలో ఎవరు?
గెలుపుపై బీఆర్ఎస్ ధీమా
సిటింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తి కానీ ఆయనకే
టికెట్!
ప్రజల్లో దూసుకెళ్తున్న కాంగ్రెస్ నేత కవ్వంపల్లి
మానకొండూరు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2009 వరకు నేరళ్ల నియోజకవర్గంలో భాగంగా ఉండి.. తర్వాత నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కొత్తగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఏర్పాటైన మానకొండూరులో ఈ సారి గెలుపు విషయంలో అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోరు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలింగ్ రోజు నాటికి ప్రజలో మదిలో ఎవరు నిలుస్తారు? ఎవరికి పట్టం కడతారు? అనే అంశం ఆసక్తికరంగా మారింది.
రసమయికే బీఆర్ఎస్ టికెట్

అభ్యర్థుల విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే సిటింగ్ ఎమ్మెల్యే, ప్రముఖ జానపద గాయకుడు రసమయి బాలకిషన్కే ఈ సారి కూడా బీఆర్ఎస్ టికెట్ ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈయనపై పలు వివాదాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఆయనపై అధికార పార్టీ స్పరంచ్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం, అదే విధంగా రసమయి మాట్లాడిన ఆడియోలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. గత ఎన్నికల హామీలను నెరవర్చలేదని రసమయికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని యువత ధర్నాలు సైతం చేపట్టారు. దీంతో ఆయనకు టికెట్ ఇస్తారా? లేదా? అనే మీమాంశ మొన్నటి వరకు కలిగింది.
రంగంలోకి కేటీఆర్
మరోవైపు రసమయికే బీఆర్ఎస్ టికెట్ అనే విధంగా పార్టీ అధిష్టానం చర్యలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నియోజకవర్గంలో గెలుపు విషయంలో ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు. ఈ క్రమంలో ఈ నియోజకవర్గం బాధ్యతలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్కు అప్పగిస్తూ తాజాగా రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. నియోజకవర్గ నేతలతో చర్చించిన ఆయన పార్టీ గెలుపు ధీమా వ్యక్తం చేయడమే కాకుండా.. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జిల్లాలో సానుకూల ఉందని తమ సర్వేల ద్వారా తెలిసిందని పేర్కొనడం గమనార్హం. దీంతో.. ఈ సారి రసమయికే మానకొండూరు టికెట్ అనే విషయం స్పష్టమవుతోంది. టికెట్ రేసులో ఓరుగంటి సతీశ్ పేరు తెరపైకి వచ్చినా.. తాజా సమచారం ప్రకారం రసమయికే టికెట్ అనేది స్పష్టంగా వినిపిస్తున్న మాట.
కాంగ్రెస్.. దూకుడుగా కవ్వంపల్లి

ఇక.. కాంగ్రెస్ పార్టీ నుంచి నియోజకవర్గంలో దూకుడుగా సాగుతున్నారు.. ఆ పార్టీ టికెట్ ఖరారైన కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగానూ ఉన్న ఆయన నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇప్పటికే పర్యటనలు సాగించారు. అదే విధంగా యూత్లోనూ ఆదరణ పొందేలా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఈయన ఒక్క ఛాన్స్ నినాదంతో ప్రజల ముందుకు వెళుతూ.. అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవినీతిని బహిర్గతం చేస్తూ.. ఓటర్ల ఆదరణకు ప్రయత్నిస్తున్నారు.
కేడర్ సమస్యలో కాంగ్రెస్
ఒకవైపు.. కాంగ్రెస్ దీటుగా పోటీ ఇస్తుందనే ధీమా వ్యక్తమవుతున్నప్పటికీ.. ఆ పార్టీకి తగిన స్థాయిలో కేడర్ లేకపోవడం సమస్యగా మారింది. గత ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆరెపల్లి మోహన్.. తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా తనకున్న ఇమేజ్తో కాంగ్రెస్ కేడర్ను కూడా బీఆర్ఎస్లోకి తీసుకెళ్లారు. దీంతో.. కాంగ్రెస్ పార్టీకి కేడర్ సమస్య తీవ్రంగా ఉంది. ఆరెపల్లి తిరిగి కాంగ్రెస్ చేరతారని ఊహాగానాలు వినిపించినా.. అది నిజం కాదని తేలింది. తాజాగా ఆయనను చొప్పదండి నుంచి బరిలో నిలిపేందుకు బీఆర్ఎస్ నేత నిర్ణయించినట్లు సమాచారం. దీంతో మానకొండూరులో ఆరెపల్లికి ఉన్న కేడర్ను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
బీజేపీ.. అభ్యర్థులు ఏరి?

ఇదిలా ఉంటే మరో ప్రధాన పార్టీ బీజేపీలో నియోజకవర్గం నుంచి అభ్యర్థుల కోసం వెతుకుడాలే పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో పార్టీ తరఫున గడ్డం నాగరాజు నిలబడినా.. ఈ సారి ఆయనను నిలబెట్టే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో.. ఆ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారిలో దరువు ఎల్లన్న, అజయ్ వర్మల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ నియోజకవర్గంను బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈసారి కాషాయ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. కానీ పరిస్థితులు మాత్రం సానుకూలంగా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ ఇద్దరి మధ్యనే పోటీ
ఇక.. నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు ఎన్నికల్లోనూ గెలిచిన రసమయి బాలకిషన్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. 2018లో 31,509 ఓట్లు, 2014లో 46,922 ఓట్లు మెజారిటీతో గెలిచిన ఆయన.. అదే జోరు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గృహలక్ష్మి, దళిత బంధు స్కీమ్లు బీఆర్ఎస్కు అనుకూలంగా మారతాయనే భావనలో ఉన్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ స్కీమ్లలో అవినీతిని ఎత్తి చూపుతూ.. ప్రజల్లో వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది.
బీసీ ఓట్లు కూడా కీలకమే
ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ.. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు కూడా కీలకంగా నిలవనున్నారు. ఈ మేరకు మొత్తం 2.11 లక్షలకు పైగా ఉన్న ఓటర్లలో దాదాపు 40 వేల మంది మున్నూరు కాపు, గీత కార్మికులు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతో.. ఇప్పటికే నాయకులు ఆయా వర్గాలకు చెందిన కుల పెద్దలను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
మొత్తంగా చూస్తే అధికార పార్టీ తమ స్కీమ్లను ఆయుధంగా చేసుకుని అడుగు పెడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న అవినీతి ఆరోపణలను ఆస్త్రాలుగా చేసుకుని గెలవలాని చూస్తోంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీదే కొంత పై చేయి అని తెలుస్తోంది. కానీ తాజాగా కేటీఆర్ రంగంలోకి దిగడంతో పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.
- మానకొండూరు నియోజకవర్గం ముఖ్యాంశాలు
- 2009లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఏర్పాటు
- 2014, 2018లో బీఆర్ఎస్ గెలుపు
- మొత్తం ఓటర్లు 2.11 లక్షలు
- కీలకంగా మారనున్న బీసీ ఓటర్లు
- మొత్తం ఓటర్లలో 40 వేలకు పైగా బీసీ ఓటర్లు



