సాయుధ పోరాటానికి నాంది పలికింది ఎర్రజెండానే
తెలంగాణ సాయుధ పోరాటం’ ప్రజా ఉద్యమాలకు దిక్చూచి
సాయుధ పోరాట యోధుల వారసత్వాన్ని కొనసాగింద్దాం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెం/సెప్టెంబర్ 11(వాయిస్ టుడే) : తెలంగాణ సాయుధ పోరాటానికి నాందిపలికింది ఎర్ర జెండానేనని, నాడు నిజాం రాజుకు వ్యతిరేకంగా, దోరలు, దేశముఖులు, రజాకారుల మూకలను తరిమికొట్టి రాచరిక వ్యవస్థను అంతమొందించి, తెలంగాణను విశాల భారతంలో విలీనం చేసి స్వేచ్ఛాయుత తెలంగాణను నిర్మించింది కమ్యూనిస్టులేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సుజాతనగర్ మండలంలోని నాయకులగూడెం గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రోజును పురస్కరించుకొని సోమవారం వారోత్సవాలను పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. తొలుత సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రావినారాయణరెడ్డి స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ నాటి దొరలు, దేశముఖ్లు, రజాకారుల మూకల దోపిడీ, దౌర్జన్యాలకు, దాడులకు ఎదురొడ్డి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ ప్రజలకు రక్షణగా నిలిచింది కమ్యూనిస్టులేనని అన్నారు. ఈ పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ పాత్ర చారితాత్మకమని, భూమి కోసం, భుక్తి కోసం, అణగారిన వర్గాల కోసం ముఖ్యంగా రైతాంగ సమస్యలకోసం, రజాకారుల రాజకీయ పాలనను అంత మొందించడంలో సిపిఐ కీలకపాత్ర పోషించిందన్నారు. 1947 సెప్టెంబర్ 11న అమరవీరులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖుం మోహియుద్దీన్ పిలుపుతో మహోద్యమం ప్రారంభం అయ్యిందని, వారి నాయకత్వంలో సాగిన సాయుధ పోరాటం వందల ఏండ్ల చరిత్ర ఉన్న నిజాం రాజును గద్దె దింపిందని, నిజాం స్వాదీనంలో ఉన్న తెలంగాణా భూ భాగాన్ని భారతదేశంలో అంతర్భాగం చేసిందన్నారు. నాటి సాయుధ పోరాటం దేశవ్యాప్త పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు నాందిపలికిందని, ఉద్యమాలకు దిక్చూచిగా నిలిచిందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ గత పాలకుల మాదిరిగానే నియంతృత్వ పాలన ప్రజలు చవిచూస్తున్నారని, దొరల పెత్తనం అంతం కోసం నాడు జరిగిన విరోచిత పోరాటం, అమరుల త్యాగాలను ఆదర్శంగా తీసుకొని ప్రజావ్యతిరేక పాలకులపై తిరగబడాల్సిన భాద్యత తెలంగాణ ప్రజలపై ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇసుక రేణువంత పాత్ర కూడా బిజెపికి లేదని, ఈ పోరాటాన్ని తామే చేసినట్లుగా చెప్పుకోవడం, ఉత్సవాలకు సిద్ధం కావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారం రోజులపాటు జిల్లా, రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, సెప్టెంబర్ 17న హైద్రాబాదులో విలీన దినం సందర్బంగా బహిరంగ సభ జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్రకుమార్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, భూక్య దస్రు, వాసిరెడ్డి మురళి, గుండె పిన్ని వెంకటేశ్వర్లు, భూక్య దస్రు, కంచర్ల జమలయ్య, కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, తాళ్లూరు పాపారావు, తాళ్లూరి ధర్మారావు, వేల్పుల భాస్కర్, నాగయ్య, కొమారి కృష్ణ, కత్తి వెంకన్న, శంకర్, మంగ్య, వెంకన్న, కొమరయ్య, నాగేశ్వరావు, శ్రీను వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



