కోదాడ,సెప్టెంబర్ 30(వాయిస్ టుడే ప్రతినిధి) సూర్యాపేట జిల్లా కోదాడలో,అద్దె కని తీసుకున్న తన ఇల్లును కబ్జా చేసాడని వెంకటరెడ్డి చేస్తున్న ఆరోపణలపై కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తక్షణమే స్పందించాలని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే స్థాయి ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి పైన కబ్జాదారుడని ఆరోపణలు రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఎమ్మెల్యే తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఇంటి యజమాని బహిరంగంగా ఫిర్యాదు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్ధిదారుల ఎంపికలో, గంజాయి, వైన్స్, మైన్స్ మాఫియా లంటూ గతంలో తనపై, తన అనుచరులపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా అవి తన రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ఆరోపణలని ఎమ్మెల్యే చెప్పాడని గుర్తు చేసారు. ఇప్పుడు అద్దె కని తీసుకొన్న తన ఇంటిని ఎమ్మెల్యే కబ్జా చేసాడని వ్యక్తిగతంగా తనపై వచ్చిన ఆరోపణలకు నియోజకవర్గ ప్రజలకు అసలు వాస్తవాలేమిటో తెలియపర్చాల్సిన నైతిక భాద్యత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై ఉన్నదని చెప్పారు. ఇంటి కబ్జాదారుడని తనపై వచ్చిన ఆరోపణలకు తనకున్న వాక్ చాతుర్యంతో సొల్లు కబుర్లు చెప్పకుండా, స్పష్టంగా తాను నిర్దోషినని నిరూపించు కోకపోతే రాబోయే ఎన్నికల్లో బొల్లంకు ఓటమి తప్పదని హెచ్చరించారు.



