ఖమ్మం, సెప్టెంబర్ 30: మంత్రి కేటీఆర్ భద్రాచలం పర్యటన రద్దైంది. భారీ వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో భద్రాచలం పర్యటన రద్దు చేసుకొని కేటీఆర్ సత్తుపల్లి పయనం అయ్యారు. భద్రాచలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం రావడంతో మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం భద్రాచలం సత్తుపల్లిలో ఈరోజు మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతుండగా ఉదయం ఖమ్మంలో పర్యటన పూర్తయింది. అనంతరం తిరిగి భద్రాచలం వెళ్లడానికి సిద్ధమవుతుండగా భద్రాచలంలో భారీ వర్షం , వాతావరణ అనుకూలించక పోవడంతో హెలికాప్టర్ కి సమస్య ఎదురైంది. ఈనేపథ్యంలో భద్రాచలం పర్యటన కేటీఆర్ రద్దు చేసుకుని సత్తుపల్లి వెళ్లారు. ప్రస్తుతం సత్తుపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది.ఖమ్మం భద్రాద్రి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉదయం ప్రారంభమైంది. హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకుని ఖమ్మంలో 1370 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పలు అభివృద్ధి పథకాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఖమ్మం మున్నేరుపై తీగల వంతెన, అదేవిధంగా మున్నేరు వల్ల ముంపును అరికట్టేందుకోసం ఆర్ సిసి వాల్ నిర్మాణాలను శంకుస్థాపనలు చేసిన అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రగతి నివేదన సభ నిర్వహించారు. ఖమ్మం నుంచి మళ్లీ భద్రాచలం బయలుదేరే సమయంలో వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకుని సత్తుపల్లికి పయనం అయ్యారు. సత్తుపల్లిలో 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకి మంత్రులు కేటీఆర్ పువ్వాడ అజయ్ లు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. తర్వాత సత్తుపల్లిలో జరగనున్న భారీ బహిరంగ సభ ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.



