
హైదరాబాద్:అక్టోబర్ 07: తెలంగాణ గ్రూప్-4 ఫలితాల విడుదలపై పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ సైతం ఫలితాల వెల్లడికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రిలిమినరీ ‘కీ’ విడుదల చేసిన కమిషన్.. తుది ఫలితాలను వెల్లడించే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూలై 1న TSPSC Group 4 పరీక్ష నిర్వహించగా.. 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆగస్టు 28న ప్రిలిమినరీ ‘కీ’ని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించారు.
అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై నిపుణుల కమిటీ కమిషన్కు తుది నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. అన్నింటినీ ఒకటికి రెండుసార్లు పరిశీలించిన టీఎస్పీఎస్సీ.. వారం రోజుల్లోగా ఫైనల్ కీ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక.. తుది ఫలితాలను అక్టోబర్ రెండో వారంలో విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే.. త్వరలో ఈ అంశంపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశముంది.



