హైదరాబాద్, అక్టోబరు 12 : ఖమ్మం జిల్లాలో బీజేపీ జాతీయ కార్యదర్శి, ఖమ్మం జిల్లా ఎలక్షన్ ఇన్చార్జ్ సునీల్ దియోధర్ పర్యటించారు. ఈ సందర్భంగా సునీల్ దియోధర్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ గజ దొంగ.. కుటుంబ పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన కుటుంబం జైల్ లో మీటింగ్ పెట్టుకునే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని సునీల్ దియోధర్ ఆరోపించారు. అవినీతి పరులను మోడీ వదిలి పెట్టరని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆయన ఉద్ఘాటించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్కి ఓటు వేసినట్టేనని సునీల్ దియోధర్ వ్యాఖ్యానించారు. రెండు హిందూ వ్యతిరేక పార్టీలు అని ఆయన విమర్శించారు.
అంతేకాకుండా.. రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, అందరి అభివృద్ది బీజేపీ లక్ష్యమన్నారు సునీల్ దియోధర్. ఖమ్మంలో గిరిజనులు, ఎస్సీలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని, ప్రజల రక్షణ, భద్రత మా లక్ష్యం.. స్వేచ్ఛ గా ఉండాలంటే బీజేపీ కి ఓటెయాలని సునీల్ దియోధర్ కోరారు. స్టికర్ బాబు.. కేసీఆర్.. అభివృద్ది, ప్రచారం కేవలం పోస్టర్ లకే పరిమితమని ఆయన అన్నారు. కాంగ్రెస్ కావాలనే బీజేపీ, బీఆర్ఎస్ కలిశాయని ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని సునీల్ దియోధర్ వెల్లడించారు. కేసీఆర్ కుమార్తె కవిత కేసు లో దర్యాప్తు సంస్థలు ఎంక్వయిరీ చేస్తున్నాయని, అవసరం అయితే వాళ్ళు అరెస్ట్ చేస్తారన్నారు.. ఎంక్వయిరీ లో బీజేపీ జోక్యం ఉండదని సునీల్ దియోధర్ స్పష్టం చేశారు.



