ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు !
భద్రాచలం, అక్టోబర్ 17 .(వాయిస్ టు డే ): దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశవ్యాప్తంగా యూపీఐ సేవల అంతరాయం ఖాతాదారుల్లో అసహనానికి దారి తీస్తోంది. ఎస్బీఐ యూపీఐ పేమెంట్స్ ఫెయిల్ కావడం, లేదంటే ఇన్ సఫీషియంట్ బ్యాలెన్స్ అన్న మెసేజ్ రావడంతో పాటు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంలో ఇబ్బందులతో (కస్టమర్లు) ఖాతాదారులు గందరగోళంలో పడి పోతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి డిజిటల్ లావాదేవీలు చాలాసార్లు ఫెయిల్ కావడంతో కస్టమర్లలో ఆందోళన తలెత్తుతోంది. ఈ సమస్య గత రెండు మూడు రోజుల నుండి జరుగుతోంది. ఎవరు పట్టించుకోవడంలేదు. ఖాతాదారుల ఇబ్బందులను బ్యాంకు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారా? అసలు ఈ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారంటూ ఒకరు ప్రశ్నించారు. టెక్నికల్ అప్డేట్ కోసం మూడురోజులా అంటూ మరొక యూజర్ ఎస్బీఐపై ధ్వజమెత్తారు.

అయితే తమ కస్టమర్ల యూనిఫైడ్స్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) సేవల్లో ఇబ్బందులు రావచ్చని బ్యాంకు ముందుగానే ఎక్స్ ద్వారా ఒక ప్రకటన జారీ చేసింది. టెక్నాలజీని అప్డేట్ చేస్తున్నట్టు ఈ నెల 14న వెల్లడించింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే అప్డేట్ అందిస్తామని ట్వీట్ చేసింది. అయితే,ఇప్పటివరకు కొత్త అప్డేట్ ఏమీ ఇవ్వకపోవడం గమనార్హం.
యూపీఐ ద్వారా చేసే డిజిటల్ పేమెంట్స్ లో గణనీయంగా పెరిగాయి. 2016 లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు రెట్లు పెరిగాయి. జనవరి, 2018 లో యూపీఐ పేమెంట్ల సంఖ్య 151 మిలియన్లు ఉండగా, అంది జూన్, 2023లో 9.3 బిలియన్లకు చేరడం గమనార్హం. చాలా వరకు “పర్సన్ టూ మర్చంట్” ట్రాన్సాక్షన్లు అధికంగా ఉన్నాయని వరల్డ్ లైన్ పేర్కొంది. మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తులు, డిపాజిట్లు, బ్రాంచులు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా చూస్తే దేశంలోనే అతిపెద్ద కమెర్షియల్ బ్యాంక్. ప్రస్తుతం ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వినియోగిస్తున్న ఎస్బీఐ కస్టమర్ల సంఖ్య వరుసగా 117 మిలియన్లు, 64 మిలియన్లకు చేరింది. గత ఆర్థిక ఏడాది 2023లో యోనో ద్వారా డిజిటల్ రూపంలో కొత్తగా సేవింగ్స్ ఖాతాలు తెరిచిన వారి సంఖ్య 63 శాతం పెరిగిందని బ్యాంకు వర్గాల నుండి సమాచారం.
చాలా సంవత్సరాలుగా ఆన్లైన్ (యుపిఐ) పేమెంట్ లకు అలవాటు పడిన కస్టమర్లు, ప్రస్తుత పరిస్థితి వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం కొంతమంది ఖాతాదారులకు కొన్ని పేమెంట్ లు పాక్షికంగా పనిచేస్తున్నట్లు సమాచారం.
గత కొద్దిరోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కస్టమర్లకు ఈ బాధలు తప్పించి, త్వరితగతిన టెక్నికల్ అప్డేట్ అందించి, పూర్తి స్థాయిలో ఈ బాధలనుండి విముక్తి కలిగించాలని కస్టమర్లు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు.



