మెదక్, నవంబర్ 4, (వాయిస్ టుడే): బీజేపీ మూడో జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఓ పేరు చర్చనీయాంశంగా మారింది. పోటీ నుంచి విరమించుకున్నట్లు సదరు నేత ప్రకటించినప్పటికీ… మూడో జాబితాలో ఆయన పేరు ఉండటం టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చెయ్యను అని ప్రకటించిన సినీ నటుడు, మాజీ మంత్రి పి బాబూమోహన్ పేరును భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల మూడో లిస్టులో ఖరారు చేసింది. అందోల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచింది. తన పేరు మొదటి లిస్టులో చేర్చకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన బాబూమోహన్… వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోనని అతను స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. తాను ఫోన్ చేసినా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి కానీ, ఇతర నాయకులూ కానీ ఫోన్ కూడా ఎత్తటం లేదని బాధపడ్డారు. అయితే ఈ రోజు తన పేరుని అందోల్ అభ్యర్థిగా ప్రకటించినా ,బాబూమోహన్ ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నాడో లేదోనని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాబు మోహన్, బీజేపీ పార్టీ తరపున 2018 ఎన్నికల్లో అందోల్ నుండి పోటీచేసి డిపాజిట్ కోల్పోయాడు.మొదటి లిస్ట్ లో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ నాయకత్వం, గురువారం రోజు విడుదల చేసిన మూడో లిస్ట్ లో మరో నలుగురు అభ్యర్థుల పేర్లని ప్రకటించింది. బాబూమోహన్ తో పాటు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, దామోదర రాజా నరసింహ సొంత తమ్ముడు అయినా రామచందర్ రాజానరసింహ ని, తమ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. అదేవిదంగా నారాయణఖేడ్ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ జనేవాడే సంగప్పని, మెదక్ నియోజకవర్గ అభ్యర్థిగా పల్లె విజయ కుమార్ ని ప్రకటించింది.అయితే పార్టీ నాయకత్వం… సంగారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసింది. శుక్రవారం నుండి నామినేషన్స్ దాఖలు చేయటం ప్రారంభం అవుతున్నప్పటికీ, ఇప్పటివరకు బీజేపీ తన అభ్యర్థుల పూర్తీ జాబితాని కూడా ప్రకటించక పోవడం తో పార్టీ నాయకులను తీవ్ర నిరాశలో ముంచింది. సంగారెడ్డి నుండి పులిమామిడి రాజు ముదిరాజ్, రాజేశ్వర్ దేష్పాండే, ఇతర నాయకులూ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. సిద్ధిపేట నుండి దూది శ్రీకాంత్ రెడ్డి,నాయిని నరోత్తం రెడ్డి, ఇతర నాయకులూ టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. బీజేపీ పార్టీ తరపున దుబ్బాక నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, నర్సాపూర్ నుండి ఎర్రగొల్ల మురళి యాదవ్, గజ్వేల్ నుండి ఈటల రాజేందర్, పఠాన్ చెరువు నుంచి నందీశ్వర్ గౌడ్ ఎన్నికల బరిలో ఉన్నారు.



