కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
న్యూఢిల్లీ నవంబర్ 8: మోదీ ప్రభుత్వం అనాలోచితంగా చేపట్టిన నోట్ల రద్దుతో సామాన్యులు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావని కాంగ్రెస్ గుర్తుచేసింది. నోట్ల రద్దు జరిగి ఏడేండ్లు పూర్తయిన క్రమంలో కాషాయ పాలకులు లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. నోట్ల రద్దు దేశ ఆర్ధిక వ్యవస్ధపై, ప్రజల జీవనోపాధిపై అతిపెద్ద దాడిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అభివర్ణించారు. ఈ అనాలోచిత తప్పుడు నిర్ణయంతో భారతీయులు ఇప్పటికీ ఆ గాయాల నుంచి తేరుకోలేదని ట్విట్టర్ వేదికగా ఆయన రాసుకొచ్చారు. నోట్ల రద్దుతో లక్షలాది చిరు వ్యాపారాలు మూతపడ్డాయని, ఉద్యోగాలు కనుమరుగయ్యాయని, ప్రజలు పొదుపు చేసుకున్న సొమ్ము ఆవిరైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నవంబర్ 8 రాత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో దెబ్బతిన్న ప్రజలు ఏడేండ్ల తర్వాత కూడా సమాధానాల కోసం వెతుకుతున్నారని అన్నారు.కోట్లాది మంది ప్రజలు తమ సొంత డబ్బు కోసం బ్యాంకుల ఎదుట ఎందుకు బారులు తీరాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో నల్ల ధనం తుడిచిపెట్టుకుపోయిందా..? ఉగ్రవాద కార్యకలాపాలు నిలిచిపోయాయా..? నకిలీ కరెన్సీ తగ్గుముఖం పట్టిందా..? అని ఖర్గే నిలదీశారు. ఒక్కసారిగా నోట్లను రద్దు చేసినా మనం నగదురహిత ఆర్ధిక వ్యవస్ధగా ఎందుకు అవతరించలేదని ప్రశ్నించారు.



