తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ని మర్యాదపూర్వకంగా కలిసిన విశాల్
Vishal met Tamil Nadu Chief Minister Joseph Vijay as a courtesy call.
తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ క్షణం నుంచి కోలీవుడ్ ప్రముఖులంతా ఒక్కొక్కరిగా వెళ్లి ముఖ్యమంత్రి విజయ్ని మర్యాదపూర్వకంగా కలుస్తూనే ఉన్నారు. తాజాగా విశాల్ తన స్నేహితుడు అయిన సీఎం విజయ్ని కలిశారు. ఈ మేరకు ఆయన ఈ భేటీ గురించి పోస్ట్ చేశారు.
‘లయోలా కాలేజీలో మన పరిచయం ఏర్పడిన నాటి నుంచి నేను మిమ్మల్ని ‘డార్లింగ్’ అని పిలుస్తూనే ఉన్నాను.. అందులో ఎలాంటి మార్పు రాలేదు. ఓ సాధారణ హీరోగా మొదలైన మీ ప్రయాణంలోని అన్ని అడ్డంకులను, విమర్శలను ఎదుర్కొని, మీ మౌనంతో, విజయంతో వాటన్నిటినీ పక్కకు నెట్టేశారు. ఒక సూపర్స్టార్గా మీరు ఉన్నత శిఖరాలకు ఎదిగి ఈనాడు తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి అయ్యారు.
ఈ రోజు పదవి, హోదా మారాయి కానీ మీరు మాత్రం మారలేదు. మిమ్మల్ని కలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది, అదే ఆప్యాయతను మళ్లీ అనుభూతి చెందాను. ఎంజీఆర్ గారి నుంచి.. జయలలిత అమ్మ వరకు, స్టాలిన్ అంకుల్ నుండి నా ప్రియ సోదరుడు ఉదయ నిధి స్టాలిన్ వరకు.. మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ‘డార్లింగ్’ అని పిలవడం ఎంతో ముచ్చటగా అనిపించింది. నాలోని ఈ మధుర క్షణాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
మీ కోసం తీసుకు రావాల్సిన బొకే, శాలువాకి బదులుగా ఆ డబ్బును మీ తరపున, మీ పేరు మీద తమిళనాడులోని ముగ్గురు అర్హులైన నిరుపేద బాలికల చదువు కోసం ఉపయోగించినందుకు మీకు ధన్యవాదాలు. వారు మిమ్మల్ని చూసి గర్వపడతారు, మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. మీ పాలనలో తమిళనాడు అత్యుత్తమంగా రాణించాలని ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.




