అభివృద్ధిలో దూసుకుపోతున్న హుస్నాబాద్
హుస్నాబాద్ లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం
హుస్నాబాద్: అప్పుడు ఎట్లున్నా హుస్నాబాద్ ఇప్పుడు ఎట్లా అయిందని.. హుస్నాబాద్ పట్టణాన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పరిచానని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ తెలిపారు. మంగళవారం హుస్నాబాద్ మున్సిపాలిటీలో 2,7,14,17వ వార్డులలో హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులలో ఇల్లు,ఇల్లూ తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని పట్టణవాసులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ కు మంగళహారతులతో, కోలాటాలతో, బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలుకుతూ పూలమాలలు వేసి శాలువాతో సతీష్ కుమార్ ను సత్కరిస్తూ తమ మద్దతు తెలిపారు. 2014కు ముందు హుస్నాబాద్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని ఇప్పుడు అభివృద్ధికి చిరునామాగా మారిందని వేలకోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసామని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

కేసిఆర్ ప్రవేశపెట్టిన 2023 బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లోని అంశాలను ప్రజలకు వివరించారు. కేసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పేరుతో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని.. ఈ పథకం వల్ల 93 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు, మహిళా సమైక్యలకు సొంత భవనాలు, రాష్ట్రంలోని అనాధల కోసం ప్రత్యేక పాలసీ, జర్నలిస్టులకు 15 లక్షల నగదు రహిత వైద్య బీమా, కేసిఆర్ ఆరోగ్య రక్ష పథకం ద్వారా బీమాపరిమితి 15 లక్షలకు పెంపు, సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయలు జీవన భృతి, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను మళ్లీ అధికారంలోకి రాగానే ఇవ్వనున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ,తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పాలించిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసిఆర్, కాంగ్రెస్, బిజెపి పార్టీల ముఖ్యమంత్రి ఎవరో చెప్పాలని ప్రతిపక్ష పార్టీల నాయకులను సతీష్ కుమార్ ప్రశ్నించారు. లీడర్, క్యాడర్ లేని ఎలక్షన్ టూరిస్ట్ పార్టీలను, ఇంకా వారి మాయమాటలను నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరన్నారు.ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరొకసారి పట్టం కడతారని సతీష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.



