ప్రజల కోసం ఎన్నడైనా పోరాడి జైలుకుపోయారా ?
కరీంనగర్ పై పూర్తి అవగాహనే లేని వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్ధి
మీ సమస్యలపై పోరాడి జైలుకు పోయిన చరిత్ర నాది
మీరు ఓట్లు వేయకుంటే పేదల పక్షాన పోరాడేవాళ్లు వెనుకంజవేస్తారు
గంగుల లక్ష సెల్ ఫోన్ల, ఓటుకు రూ.10 వేలను నమ్ముకున్నడు
ఓటుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ది చెప్పండి
బీజేపీ కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ పిలుపు
కరీంనగర్ వచ్చి అభివ్రుద్ధి గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్న
‘కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధికి భూకబ్జాలు తప్ప తెలుసు? అసలు ఆయనకు కరీంనగర్ పైన అవగాహనే లేదు. ఆయనతోపాటు బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ ఏ ఒక్కరోజైనా కరీంనగర్ ప్రజల కోసం పోరాటాలు చేశారా? ఏన్నడైనా జైలుకు పోయారా?’’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తాను నిరంతరం ప్రజల కోసం పోరాడానని, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలుసహా అన్ని వర్గాల ప్రజల పక్షాన పోరాడి జైలుకు వెళ్లానని చెప్పారు. తాను ప్రజల కోసం కొట్లాడితే… తనకు కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట 74 కేసులని అన్నారు. ప్రజల కోసం తన కుటుంబాన్ని కూడా పక్కకుపెట్టి పోరాడానని, ఏనాడూ భార్యాపిల్లలకు పూర్తి సమయం కేటాయించలేదని చెప్పారు. ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడేవారిని గెలిపించకపోతే… ఇకపై పేదల పక్షాన పోరాడేవాళ్లు వెనుకంజ వేసే ప్రమాదముందని హెచ్చరించారు. ఎన్నికల్లో భాగంగా ఈరోజు కమాన్ పూర్ గ్రామంలో ప్రచారం చేసిన బండి సంజయ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

నిన్న కేసీఆర్…. కరీంనగర్ వచ్చి ఏం మాట్లాడిండు… 10 ఏళ్లలో ఏం చేసిండో చెప్పిండా? ఏమీ లేదు… నాకు మతపిచ్చి అట… ఒకసారేమో నా తల ఆరు ముక్కలు చేస్తనంటడు… ఆయనకు నేను చెప్దొక్కటే…..పేదలకు రేషన్ కార్డులిచ్చి నా తలనరుకు… పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వు నా తల నరుక్కుంటా. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు, నిరుద్యోగ భ్రుతి ఇవ్వు.. నా తల నరుక్కుంటా… పోనీ పంట నష్ట పరిహారం, కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వు.. నా తల నరుక్కుంటా…భరిస్తా…
10 ఏళ్లలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వని కేసీఆర్ … తన కుటుంబంలో మాత్రం అందరికీ పదవులిచ్చుకున్నడు.. మనవడికి వయసు లేదు కానీ… అతనికి కూడా పదవి ఇచ్చే వాళ్లు… ప్రజలు కేసీఆర్ పాలనపట్ల విసిగిపోయిర్రు. డిసెంబర్ 4 నుండి కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నడు.,..
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధికి కరీంనగర్ నియోజకవర్గం గురించి ఏమీ తెల్వదు. ఆయనకు పేదలకు ఏం చేయాలో, కరీంనగర్ ను అభివ్రుద్ధి ఎట్లా చేయాలో తెల్వదు. తెలిసిందల్లా భూకబ్జాలు చేయడమే.. ఆయనపై ఉన్నవన్నీ కబ్జా కేసులే… గంగుల కమలాకర్, పురమళ్ల శ్రీనివాస్ ఎన్నడైనా మీకోసం కొట్లాడి జైలుకు పోయారా? మీ లెక్క నాకూ భార్యాపిల్లలున్నరు. మీరు హోటల్ కు, ఫంక్షన్లకు, సినిమాలకు పోతారు.. కానీ నేను భార్యాపిల్లలతో సినిమాలకు వెళ్లలేదు. ఫంక్షన్లకు పోలేదు.. మీకోసం కొట్లాడుతుంటే.. ప్రత్యర్థులు ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెల్వని పరిస్థితి… పాతబస్తీలో సభ పెడితే నా భార్యాపిల్లలను చంపుతామని బెదిరించారు. ప్రజల కోసం ఎంతకైనా తెగించాలని నా కుటుంబాన్ని పక్కనపెట్టి సభ పెట్టిన.
ప్రజల కోసం పోరాడుతున్న నా మీద 74 కేసులున్నయ్. అవన్నీ ఎవరి కోసం? మీకోసం కొట్లాడిన. పేదల సమస్యలపైన, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం కొట్లాడితే కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ 74 కేసులు… ఒక్కసారి ఆలోచించండి… ఎంపీగా పార్లమెంట్ నియోజకవర్గానికి రూ.8 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చిన. కరీంనగర్..జగిత్యాల, కరీంనగర్..వరంగల్ జాతీయ రహదారి నిర్మాణం కోసం నిధులు తెచ్చిన. స్మార్ట్ సిటీకి నిధులు తెచ్చిన. గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి నిధులన్నీ కేంద్రానివే నని అన్నారు.



